Railways Rules | రైలు ప్రయాణం చేస్తుంటారా..? లోయర్ బెర్త్ రూల్స్ తెలుసా..?

Railways Rules | భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ నిత్యం లక్షలాది మంది జనం ప్రయాణిస్తుంటారు. దేశంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న ప్రజా రవాణాల్లో రైల్వే ముందున్నది. ప్రతి ప్రయాణికుడి అవసరాలను తీర్చేందుకు రైల్వేశాఖ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రైళ్లలో ప్రయాణం చేసే వెలుసులుబాటు ఉన్నది. రైలు ప్రయాణ సమయంలో ముందుస్తుగానే టికెట్లను బుక్ చేసుకునేందుకు సౌలభ్యం ఉన్నది. అలాగే, అత్యవసర సమయాల్లో తాత్కాల్ టికెట్లు సైతం జారీ చేస్తున్నది. అయితే, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రైల్వేశాఖ ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నది. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా లోయర్ బెర్తులను అందిస్తున్నది. మిగతా వారితో పోలిస్తే అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు సీనియర్ సిటిజన్లు ఇబ్బందులుపడుతుంటారు. వారికి ఉపశమనం కల్పించేందుకు రైల్వేశాఖ పలు రూల్స్ను తీసుకువచ్చింది.
వాటితో సీనియర్ సిటిజన్స్ ప్రయాణం సులభతరం కానున్నది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా లోయర్ బెర్తులను బుక్ చేసే వీలు కల్పిస్తున్నది. జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటేనే అలాట్మెంట్ ఉంటుంది. లేకపోతే సీట్లు లభించవని రైల్వేశాఖ పేర్కొంది. రిజర్వేషన్ సమయంలో సీనియర్ సిటిజన్ కేటగిరి కింద బుక్ చేసుకుంటేనే రిజర్వేషన్ ఛాయిస్ కింద లోయర్ బెర్తు లభిస్తుందని పేర్కొంది. బెర్తులు ఉన్న సమయంలోనే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే చెప్పింది. ఈ బెర్తులు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని తెలిపింది. తత్కాల్ ఇతర కోటాల్లో టికెట్లు బుక్ చేసే సమయంలో మానవ జోక్యం ఏమీ ఉండదని పేర్కొంది. రైలులో ప్రయాణ సమయంలో లోయర్ బెర్త్ కోసం టీటీఈని సంప్రదించవచ్చని.. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే కేటాయించేందుకు అవకాశం ఉంటుందని రైల్వేశాఖ వివరించింది.