Stray Dog vs King Cobra | వీధి కుక్కలపై చాలా మందికి సదాభిప్రాయం ఉండదు. ఎందుకంటే అవి మనషులపై దాడి చేస్తాయని. వీధి కుక్కలను తరిమి కొడుతుంటాం. కానీ ఈ వీధి కుక్క మాత్రం స్కూల్ విద్యార్థుల ప్రాణాలకు రక్షణగా నిలిచి వీరోచిత పోరాటం చేసింది. 30 మంది విద్యార్థుల మధ్య దూరిన నాగుపాముతో వీరోచిత పోరాటం చేసి.. దాన్ని చంపి, చివరకు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మయూర్భంజ్ జిల్లాలోని ధిరాకుల గ్రామంలో శ్రీ జగన్నాథ శిశు విద్యామందిర్ అనే పాఠశాల ఉంది. ఏప్రిల్ 20న ఉదయం 8.30 గంటల సమయంలో పిల్లలు స్కూల్కు చేరుకున్నారు. ఓ 30 మంది విద్యార్థులు స్కూల్ ప్రాంగణంలోనే ఆడుకుంటున్నారు. అంతలోనే బుసలు కొడుతూ ఓ నాగుపాము వారి మధ్యలో ప్రత్యక్షమైంది. టీచర్లు, సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే పాము.. పిల్లలపైకి దూసుకెళ్లింది.
ఆ స్కూల్ ప్రాంగణంలోనే ఉండే కాళీ అనే వీధి కుక్క అప్రమత్తమైంది. నాగుపామును పసిగట్టిన కుక్క.. విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిసైడ్ అయింది. దీంతో నాగుపాముతో వీరోచిత పోరాటం చేసింది. పాము కుక్కను కాటు వేస్తున్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. పిల్లలను కుక్క రక్షించింది. మొత్తానికి కుక్క దాడిలో పాము ప్రాణాలు విడిచింది. ఇక అప్పటికే కుక్కకు శరీరమంతా విషం వ్యాపించడంతో కాసేపటికే ప్రాణాలు వదిలింది.
30 మంది పిల్లలను ప్రాణాలతో కాపాడి.. చివరకు ప్రాణాలకు విడిచిన కుక్కకు గ్రామస్తులు నివాళులర్పించారు. కాళీ మృతదేహాన్ని తెల్లటి వస్త్రంతో కప్పి, పూలమాలలు వేసి మనుషులకు చేసినట్లే సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఒక చిన్న ట్రాలీపై కాళీ భౌతికకాయాన్ని ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికారు.
30 మంది పిల్లలను ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రక్షించిన కాళీ వీరగాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. “నిజమైన హీరోలు మనుషులే కానక్కర్లేదు” అంటూ జనం సోషల్ మీడియాలో కాళీకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
