దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది.
సుప్రీంకోర్టు కీలక తీర్పు
విధాత : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. జూన్ 1వరకు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలలో తమ పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను సబబుగా పరిగణించిన సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఆయన తరుపున వాదనలను, ఈడీ వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసి ఆ మేరకు తీర్పు వెలువరించింది. దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్.. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని కొత్త షరతు పెట్టింది. ఇది చాలా అసాధారణ పరిస్థితి అని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని తెలిపింది. అంతేకాకుండా ఆయన తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని.. లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని.. పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకిస్తూ తన వాదనలు వినిపించింది. ఆయన ఎన్నికల ప్రచారం చేసే హక్కు.. ప్రాథమికమైనది కాదని స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని.. న్యాయపరమైన హక్కు కూడా కాదని ఈడీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఏ రాజకీయ నాయకుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు అయితే లేవని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అదీకాక ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి కూడా కాదని వివరించింది. గతంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమన్లు తప్పించుకొనేందుకు అరవింద్ కేజ్రీవాల్… ఈ తరహా పద్దతిని అనుసరించారని తన అఫిడవిట్లో ఈడీ గుర్తు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం చివరకు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.