Pre-Marital Relationships | “మేము పాతకాలపు వాళ్లమేమో కానీ…” పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

పెళ్లికి ముందు శారీరక సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. పెళ్లి హామీతో సంబంధం పెట్టుకున్న కేసులో బెయిల్ విచారణ సందర్భంగా “మేము పాతకాలపు వాళ్లమేమో..” అంటూ న్యాయమూర్తులు చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Pre-Marital Relationships | “మేము పాతకాలపు వాళ్లమేమో కానీ…” పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు

“We Are Old-Fashioned…”: Supreme Court Makes Strong Remarks On Pre-Marital Physical Relationships

విధాత జీవనశైలి​ డెస్క్​ | హైదరాబాద్​:

Pre-Marital Relationships | పెళ్లికి ముందే శారీరక సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. న్యాయమూర్తులు బీవీ నాగరత్న (BV Nagarathna), ఉజ్జల్ భుయాన్ (Ujjal Bhuyan)ల ధర్మాసనం ఈ కేసును విచారించింది.

 పెళ్లి ముందు అపరిచితులే కదా.. అలా ఎలా?న్యాయస్థానం సూటి ప్రశ్న

విచారణలో భాగంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, “మేము పాతకాలపు వాళ్లమేమో కానీ, పెళ్లికి ముందు అబ్బాయి–అమ్మాయి పరస్పరం అపరిచితులే. సంబంధం ఎంత బలమైనదైనా, పెళ్లికి ముందే శారీరక సంబంధం ఎలా ఏర్పరచుకుంటారు” అని సూటిగా ప్రశ్నించారు.  “పెళ్లికి ముందు ఎదుటివారిని నమ్మడంలో అత్యంత జాగ్రత్త అవసరం” అని సూచించారు.

ప్రాసిక్యూషన్ ప్రకారం, 2022లో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఇద్దరూ పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుంటానని  హామీ ఇచ్చి మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ప్రాసిక్యూషన్​ ఆరోపిస్తూ, ఆ సంబంధం దుబాయ్ వరకు కొనసాగిందని తెలిపింది. ఆమె అనుమతి లేకుండా ఆ వ్యక్తి శారీరకంగా దగ్గరగా ఉన్నప్పటి వీడియోలు రికార్డ్ చేసి, వాటిని బయటపెడతానని బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తరువాత ఆ వ్యక్తి ఇప్పటికే వివాహితుడని, 2024 జనవరిలో పంజాబ్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని మహిళ తెలుసుకున్నట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

పరస్పర సమ్మతితోనే సంబంధం కొనసాగితే..

మహిళ పెళ్లికే కట్టుబడి ఉంటే, పెళ్లికి ముందే దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏమిటని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాది ఇద్దరూ మ్యాట్రిమోనీ సైట్‌లో కలుసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పినప్పుడు, “అంత కఠినంగా ఉండాలనుకుంటే ముందుగా వెళ్లకూడదు” అని వ్యాఖ్యానించారు.

“ఇది విచారణ చేసి శిక్షించాల్సిన కేసుగా కనిపించడం లేదు, సంబంధం పరస్పర సమ్మతితో జరిగితే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చూడాలి” అని ధర్మాసనం పేర్కొంది.

కేసు తదుపరి విచారణకు బుధవారానికి వాయిదా వేసారు.