Revanth Reddy: తెలంగాణను.. ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యం

విధాత: తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దావోస్ పర్యటనతో లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడానికి పని చేయడమనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.
రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లొద్దని హితవు పలికారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. మనందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు. ఇది భవిష్యత్ లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు.
ప్రకృతి వనంగా తెలంగాణ
రాష్ట్రానికి త్వరలో టూరిజం పాలసీని తీసుకు రాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఉదయం ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక మంచి ఎకో టూరిజం పార్క్ ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వమే ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నామన్నారు. తెలంగాణలో రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు ఉన్నాయన్నారు.
దీంతోపాటు నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నామని వెల్లడించారు. ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుందని తెలిపారు. వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు.
రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోందన్నారు. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.