విహార యాత్రకు వెళ్లాలి అనుకుంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపేరు కేరళ. కేరళ అందాలు ఎంతటివారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఎత్తైన కొండలు, వాటిపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్లు, చుట్టూ కాఫీ తోటలు మన కళ్లను కట్టిపడేస్తాయి. పచ్చదనం పర్చుకున్న కొండలు వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు, అందమైన జలపాతాలు, లోయలు, పడవ ప్రయాణాలు ఆకట్టుకుంటాయి అలాంటి దేవ భూమి అందాలు చూపించేందుకు IRCTC మన ముందుకు రూ. 14720కే కేరళ హిల్స్ అండ్ వాటర్స్ అనే పేరుతో ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ యాత్ర పూర్తిగా 5 రాత్రులు, 6రోజుల పాటు సాగుతుంది. ఇంకేంటి మరి కేరళ అందాలు చూసేందుకు సిద్ధంగా ఉంటే ఈ నెల 18 యాత్ర ప్రారంభం కానుంది. అలాటే ప్రతి మంగళవారం ఈ యాత్రకు సంబంధించి రైళ్లు ఉంటాయి.
యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు: మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 2.25 గంటలకు శబరి ఎక్స్ ప్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడం కుదరని వారు నల్లగొండ, గుంటూరు, తెనాలి స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఆయా స్టేషన్లలో సైతం ఎక్కవచ్చు. రాత్రంగా ప్రయాణం చేసిన తర్వాత రెండవ రోజు ఉదయం 11.30 గంటలకు అలువా రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 110 కి.మీ దూరంలో ఉన్న మున్నార్కు కారులో తీసుకు వెళ్తారు. అక్కడ హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. ఆ రోజు సాయంత్రం మున్నార్ టౌన్ను చూడవచ్చు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఇరవైకులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టీ డ్యాం, ఎకో పాయింట్ చూపిస్తారు. రాత్రికి హోటల్లో బస చేశాక. నాలుగవ రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత 170 కి.మీ దూరంలో ఉన్న అలెప్పీకి రోడ్డు మార్గంలో తీసుకువెళ్లి అక్కడ హోటల్లో చెకిన్ చేస్తారు. ఆ రోజంతా అలెప్పీ బ్యాక్ వాటర్ సందర్శించవచ్చు. రాత్రికి అలెప్పీలోనే బస చేస్తారు. ఇక 5వ రోజు హోటల్ ఖాళీ చేసి 60 కి.మీ దూరంలో ఉన్న ఎర్నాకులం రైల్వే స్టేషన్లో దింపేస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.15 గంటలకు శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కి రాత్రంతా జర్నీ చేసి 6వ రోజు ఆదివారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
టికెట్ ధరలు: ఈ ప్యాకేజీలో కంఫర్ట్, స్టాండర్డ్ అనే రెండు రకాల మోడ్లు ఉంటాయి. కంఫర్ట్ అయితే 3 ఏసీ టికెట్లు, హోటల్లో ఏసీ గదులు ఏర్పాటు చేస్తారు. స్టాండర్డ్లో అయితే స్లీపర్ క్లాస్ టికెట్లు, హోటల్లో నాన్ ఏసీ గదులు ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కరు మాత్రామే వెళ్తే కంఫర్ట్ అయితే రూ. 33390, స్టాండర్డ్ అయితే రూ. 30610. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ.19440, స్టాండర్డ్ అయితే రూ. 16670 చొప్పున పడుతుంది. అదే ముగ్గురు కలిసి వెళ్లినట్లైతే ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ. 16820, స్టాండర్డ్ 14040 పడుతుంది. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లైతే కంఫర్ట్ అయితే బెడ్తో పాటు రూ. 10510, స్టాండర్డ్ రూ. 7730, అదే బెడ్ లేకుండా అయితే కంఫర్ట్ రూ. 8080, స్టాండర్డ్ రూ. 5300.
ఇక డిసెంబర్ 30 నుంచి 31 రాత్రి గాలా డిన్నర్తో కలిపి కంఫర్ట్లో ఒక్కరు మాత్రమే వెళ్తే రూ. 37310, స్టాండర్డ్ రూ. 34530. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ. 22800, స్టాండర్డ్ రూ. 17390, ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి కంఫర్ట్ రూ. 20170, స్టాండర్డ్ రూ. 17390 చొప్పున పడుతుంది. పిల్లలకు అయితే కంఫర్ట్ రూ. 13680, స్టాండర్డ్ రూ.10900, బెడ్ లేకుండా అయితే.. కంఫర్ట్ రూ.11120, స్టాండర్డ్ రూ. 8350.
గమనిక: ఈ ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం IRCTC వెబ్ సైట్ను సంప్రదించగలరు.
