CM With PM | యూపీ, తమిళనాడు, ఏపీ తరహాలో మాకూ ప్రోత్సాహం ఇవ్వండి

- మెట్రో రెండో దశ విస్తరణకు సహకరించాలి
- ఆర్ఆర్ఆర్కు పాలన, ఆర్థిక అనుమతులు
- బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్టుకు
- గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటుకు నిధులు ఇవ్వండి
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విన్నపాలు
CM With PM | హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ ఫేజ్ 2కు ఆమోదం తెలియజేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను విస్తరించాల్సిన తక్షణ ఆవశ్యతను ఆయనకు తెలిపారు. ఫేజ్ 1 (69 కిమీ)లో మూడు కారిడార్లు ఉన్నాయని, దీనిని రూ.22,000 కోట్లతో నిర్మించారని పేర్కొన్నారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞాపనలు సమర్పించారు. గత ప్రభుత్వం మెట్రోను విస్తరించలేదని తెలిపారు. తమ ప్రభుత్వం 76.4 కిలోమీటర్లతో ఐదు కారిడార్లతో ఫేజ్ 2 విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 24,269 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. అందులో కేంద్రం 18% (రూ. 4,230 కోట్లు) భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 30% (రూ. 7,313 కోట్లు) ఖర్చు చేస్తుందని, మరో 48% (రూ. 11,693 కోట్లు) రుణాలుగా తీసుకుంటామని వివరించారు.
రీజినల్ రింగ్ రోడ్
హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో ప్రాంతీయ రింగ్ రోడ్డును (ఆర్ఆర్ఆర్) తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని ప్రధానికి ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తర భాగం: సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్ (ఎన్హెచ్ 161), దక్షిణ భాగం: చౌటుప్పల్ – అమన్గల్ – షాద్నగర్ – సంగారెడ్డి (ఎన్హెచ్ 65)తో ట్రిపుల్ ఆర్ ఉంటుందని వివరించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూముల సేకరణ 2022లో ప్రారంభమైందని, భూసేకరణ వ్యయంలో రాష్ట్రం 50 శాతం భరిస్తున్నదని తెలిపారు. 90% భూముల ప్రతిపాదనలు ఎన్హెచ్ఏఐకి పంపామని తెలిపారు. ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచిందని పేర్కొన్నారు. ఈ భాగానికి అవసరమైన ఆర్థిక, క్యాబినెట్ ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వృద్ధితో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇప్పుడున్న ORR రానున్న 5 సంవత్సరాల్లో సరిపోదని తెలిపారు. ఆర్ఆర్ ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉన్నందున రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తేనే సరైన ఉపయోగం ఉంటుందని తెలిపారు.
రింగ్ రైల్వే ప్రాజెక్ట్…
రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కిమీ పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించామని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుందన్నారు. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. దేశంలో 35 శాతం ఔషధాలు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. బందరుపోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందని తెలిపారు. ఈ మార్గం తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
సెమీకండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వండి..
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ప్రధానికి తెలిపారు. హైదరాబాద్లో ఏంఎండీ, క్వాల్కామ్, ఎన్విడియా వంటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నయని పేర్కొన్నారు. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ISM ప్రాజెక్ట్కు కేంద్రం ఆమోదం తెలపాలని కో రారు. అది పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి, ఉద్యోగాలు సృష్టిస్తుందని, 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి తోడ్పడుతుందని తెలిపారు.
రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వండి…
హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని డీఆర్డీయూ, డిఫెన్స్ పీఎస్యూలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. వాటి పరిధిలో 1,000కి పైగా ఎంఎస్ఎంఈలు స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయని తెలిపారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, శాఫ్రాన్ అండ్ హనీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్ పై ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. రక్షణ రంగంలోని JVs & Offsetలకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరమని తెలిపారు. ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలన్నారు.
హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రతిపాదన:
యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రోత్సాహం ఉంది కానీ.. హైదరాబాద్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్పో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.