కాంగ్రెస్ కొంప ముంచిన… కోయిలకొండ
ఉమ్మడిమహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ కి కంచుకోట గా పేరున్న కోయిలకొండ మండలం లో కమలం వికసించింది. ఇది ఇవ్వరూ ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. నారాయణ పేట నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ మండలంలో బీజేపీ కి అంతంత మాత్రమే క్యాడర్ ఉంది

– నారాయణ పేట నియోజకవర్గం లో కాంగ్రెస్ కు భారీ దెబ్బ
– ఈ నియోజకవర్గం లోని కోయిలకొండ మండలం లో బీజేపీ కి భారీ మెజారిటీ
– ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన మెజారిటీ కంటే బీజేపీ కి ఎక్కువ మెజారిటీ
– కాంగ్రెస్ కంచుకోట కోయిలకొండ మండలాన్ని బద్దలు కొట్టిన బీజేపీ
– మొత్తంగా నారాయణ పేట నియోజకవర్గం లో బీజేపీ కి ఊహించని ఓట్లు
– బీజేపీ కి 19884 ఓట్ల మెజారిటీ ఇచ్చిన నారాయణ పేట నియోజకవర్గం
నిరాశ, నిస్పృహలో పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
విధాత, ఉమ్మడిమహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ కి కంచుకోట గా పేరున్న కోయిలకొండ మండలం లో కమలం వికసించింది. ఇది ఇవ్వరూ ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. నారాయణ పేట నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ మండలంలో బీజేపీ కి అంతంత మాత్రమే క్యాడర్ ఉంది. కానీ మెజారిటీ మాత్రం ఏ మండలంలో రాని విధంగా బీజేపీ కి రావడం తో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ మండలం మెజారిటీ ఎంత వచ్చిందో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సుమారు అంతే మెజారిటీ తో గెలుపొందడం విశేషం. అందుకే ఈ మండల కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మండలం లో 4900 పైగా బీజేపీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 4500 ఓట్ల మెజారిటీతో విజయం పొందారు. మొత్తంగా నారాయణ పేట నియోజకవర్గం లో 19884 ఓట్ల మెజారిటీ బీజేపీ కి దక్కించుకుంది. ఈ మెజారిటీ బీజేపీ గెలుపునకు పునాది వేసింది. ఈ నియోజకవర్గం లోని కోయిలకొండ మండలం పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోయిలకొండ మండలం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్ణికకు ( ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ) 3400 ఓట్ల పైనే మెజారిటీ వచ్చింది.కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి అధిక మెజారిటీ రావడం తో కాంగ్రెస్ శ్రేణులు విస్తుపోయారు.ప్రస్తుతం జిల్లా లో ఈ మండలం హాట్ టాపిక్ గా మారింది.
…………………………………..
ఏడుగురు ఎమ్మెల్యే లకు షాక్ :
……………………………………
కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే లు…దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా… ఎనిమిది పర్యాయాలు సీఎం ప్రచారం … వెరసి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట ను బీజేపీ బద్దలు కొట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులువు అనుకున్న పార్టీ శ్రేణులు ఫలితం చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నా ఇక్కడ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇందులో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి బలం ఉండడం తో ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న వంశీచంద్ రెడ్డి గెలుపు సునాయాసంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏ క్యాడర్ లేకున్నా బీజేపీ అభ్యర్థి గా డీకే అరుణ బరిలోకి రావడం…నియోజకవర్గం పై పట్టు బిగించిన విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కి వెళ్ళింది. ఇక్కడ బీజేపీ గెలిస్తే తన పరువు పోతుందనే ఉద్దెశం తో ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఎనిమిది సార్లు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందుతారని పలు సర్వే లు వెల్లడించడం తో సీఎం దృష్టి అంతా ఈ నియోజకవర్గం పైనే పెట్టారు.
ప్రచారం లో డీకే అరుణ ను టార్గెట్ చేసి మాట్లాడం.. మహిళ అని చూడకుండా విమర్శలు చేయడంతో ప్రజల్లో సీఎం పై కొంత అసహనం పెరిగింది. మహిళ అని చూడకుండా ‘ పండపెట్టి తొక్కుతా ‘అనే పదాలు డీకే అరుణ ను ఉద్దెశించి అనడం జిల్లా లో వివాదస్పదం అయింది. ఈ మాటనే అరుణ ప్రచారం లో బాగా వాడుకుంది. మహిళ పై సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా కొంత మైనస్ గా మారినట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతూ ప్రచారం లో దూసుకుపోయిన అరుణ కు నేడు విజయం వరించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారాయణ పేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్ లో బీజేపీ అధిక్యం ప్రదర్శించగా, జడ్చర్ల, షాద్ నగర్, కొడంగల్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఆశించిన మెజారిటీ రాకపోడడం కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైంది. ఇక్కడ 50 వేల మెజారిటీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రతి సభలో ప్రజలను కోరారు.ఇక్కడ తాను ఎమ్మెల్యే గా ఉన్నానని మెజారిటీ భారీగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరినా ఓటర్లు మాత్రం 21854 ఓట్ల మెజారిటీ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున మెజారిటీ ఆశిస్తే అనుకున్న దాంట్లో సగం కూడా మెజారిటీ రాకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. మక్తల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా బీజేపీ కి 9078 ఓట్ల మెజారిటీ వచ్చింది.
దేవరకద్ర నియోజకవర్గం లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా బీజేపీ మెజారిటీ సాధించుకుంది. ఇక్కడ బీజేపీ 1810 మెజారిటీ తెచ్చుకుంది. మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే ఉన్నా బీజేపీ అధిక్యం చాటుకుంది. ఇక్కడ బీజేపీ కి 7601 మెజారిటీ వచ్చింది.కానీ జడ్చర్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం లో కొనసాగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4879 మెజారిటీ సాధించింది. షాద్ నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడంతో 8004 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ కు వచ్చింది. ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే లు ఉన్నా మూడింట్లో మాత్రమే మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కి వచ్చింది.మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజారిటీ రావడం తో అరుణ విజయానికి బాటలు పడ్డాయి.
నారాయణ పేట నియోజకవర్గం ఆమె పుట్టిన గడ్డ కావడం… మక్తల్ ఆమె పెరిగిన ప్రాంతం కావడం.. గతంలో మక్తల్ ఎమ్మెల్యే గా ఆమె తండ్రి చిట్టెం నర్సి రెడ్డి ( దివంగత )చేసిన సేవలు ప్రస్తుత ఎన్నికల్లో అరుణ కు కలిసివచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ల మాటలు ప్రజలు నమ్మలేదని తెలుస్తోంది. ఏడుగురు ఎమ్మెల్యే లు ఉన్నా తమ పార్టీ అభ్యర్థి ని గెలిపించుకోలేక పోయారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సక్రమంగా క్యాడర్ లేని బీజేపీ గెలుపొందడం తో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశ్చర్యనికి గురవుతున్నారు. క్యాడర్ లేకున్నా మోడీ చరిష్మా ను నమ్ముకుని ప్రచారం లో ఒంటరిగా పోరు చేసి నేడు పార్లమెంట్ సభ్యురాలిగా డీకే అరుణ ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఒకవైపు బీ ఆర్ ఎస్ గట్టి పోటీ ఇవ్వక పోవడం కూడా బీజేపీ కి కలిసి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో బీ ఆర్ ఎస్ క్యాడర్ చివరి నిమిషం లో బీజేపీ వైపు మళ్ళిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదియేమైనా ఉత్కంఠ రేపిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చివరకు బీజేపీ కి విజయం దక్కింది.
…………………………….