India AI Impact Summit 2026 | భారత్‌లో AI విప్లవానికి రూ.10 లక్షల కోట్లు : ముఖేశ్​ అంబానీ

న్యూఢిల్లీలో జరిగిన India AI Impact Summit 2026లో ముకేశ్ అంబానీ రూ.10 లక్షల కోట్ల AI పెట్టుబడి ప్రకటించారు. జామ్‌నగర్‌లో భారీ డేటా సెంటర్లు, 10 గిగావాట్ గ్రీన్ పవర్, జియో ఎడ్జ్ కంప్యూటింగ్ ద్వారా దేశవ్యాప్తంగా AI అందుబాటులోకి తేవడమే లక్ష్యమని వెల్లడించారు.

Mukesh Ambani announcing Rs 10 lakh crore AI investment at India AI Impact Summit 2026 in New Delhi

Mukesh Ambani Announces ₹10 Lakh Crore AI Investment: Jio to Lead India’s Intelligence Era

రూ.10 లక్షల కోట్ల AI విప్లవం

భారత్‌ను కృత్రిమ మేధలో అజేయశక్తిగా తీర్చిదిద్దేందుకు ముకేశ్ అంబానీ భారీ పెట్టుబడి ప్రకటించారు. జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లు, 10 గిగావాట్ గ్రీన్ పవర్ వినియోగం, జియో ఎడ్జ్ కంప్యూటింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకూ AI అందుబాటులోకి రానుంది. 2047 వికసిత భారత్ లక్ష్యానికి ఇది కీలక ముందడుగుగా అంబానీ పేర్కొన్నారు.

 

విధాత బిజినెస్​ డెస్క్​ | హైదరాబాద్​:

India AI Impact Summit 2026 | భారత్‌ను కృత్రిమ మేధలో (AI) ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు రిలయెన్స్​ అధినేత ముఖేశ్​ అంబానీ  కీలక ప్రకటన చేశారు. న్యూఢిల్లీ లో జరిగిన India AI Impact Summit 2026 వేదికగా వచ్చే ఏడు సంవత్సరాల్లో రూ.10 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనున్నట్లు వెల్లడించారు. జియో ద్వారా ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చినట్టే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగాన్ని దేశానికి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అంబానీ మాట్లాడుతూ, భారత్ మేధస్సును అద్దెకు తీసుకునే స్థితిలో ఉండకూడదనీ, డేటా ఖర్చును ఎంత తగ్గించామో, అదే విధంగా మేధస్సు ఖర్చును కూడా తగ్గిస్తామని పేర్కొన్నారు. ఈ పెట్టుబడి కేవలం వ్యాపార లాభాల కోసం కాదని, దేశ నిర్మాణానికి దోహదపడే దీర్ఘకాలిక మూలధనమని వివరించారు.

జామ్‌నగర్‌లో భారీ డేటా సెంటర్లు – 10 గిగావాట్ల హరిత విద్యుత్తు

ఈ ప్రణాళిక మూడు మూల స్తంభాలపై ఆధారపడివున్నట్లు ముఖేశ్​ India AI Impact Summit 2026లో వెల్లడించారు. మొదటిగా, జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి AI డేటా సెంటర్ల నిర్మాణం కాగా, 2026 చివరికల్లా తొలి 120 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి రానుంది. రెండవది, కచ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి లభించే 10 గిగావాట్ గ్రీన్ పవర్‌ను వినియోగించి AI మౌలిక వసతులకు విద్యుత్తునందించడం. ఇక మూడవది, జియో నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఎడ్జ్ కంప్యూటింగ్ వ్యవస్థ. ఇది నగరాలకే కాక గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగంగా AI సేవలను అందిస్తుంది. కిరాణా దుకాణాల నుంచి పొలాల వరకు, పాఠశాలల నుంచి ఆరోగ్య కేంద్రాల వరకు మేధస్సును అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.

ఉద్యోగాలపై భయం అవసరం లేదు – ప్రపంచానికి భారత్​ నాయకత్వం

AI ఉద్యోగాలను తగ్గించదనీ, బదులుగా ఉన్నత నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తుందని అంబానీ పేర్కొన్నారు. తయారీ, డీప్ టెక్, స్టార్టప్ వ్యవస్థలకు ఇది కొత్త ఊపునందిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా వినియోగ దేశంగా భారత్ ఎదిగిందని, నెలకు 1200 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగుతున్నాయని గుర్తుచేశారు.

భారత్‌కు జనశక్తి, ప్రజాస్వామ్యం, డిజిటల్ మౌలిక వసతులు, విస్తృతమైన డేటా ఉత్పత్తి వంటి అనేక సామర్థ్యాలున్నాయని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో AI కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Latest News