India Vs England | టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా గురువారం మరో కీలకమైన మ్యాచ్‌ జరుగనున్నది. ఫైనల్‌ బెర్తు కోసం భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడబోతున్నాయి. 2022 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌లో ఈ రెండుజట్లు పోటీపడగా.. తాజాగా మరోసారి బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తిని రేపుతున్నది. టీ20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో టీమిండియా విజయాలను నమోదు చేసి జోరుమీదున్నది. రెండుఓటములతో సెమీస్‌ చేరిన ఇంగ్లండ్‌ మరోసారి ఫైనల్‌ చేరేలాని ఆరాటపడుతున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగి ఆడడం భారత్‌కు ఊరటనిస్తున్నది.

స్పిన్నర్లకు అనుకూలం

నేటి సెమీస్‌ మ్యాచ్‌కు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్నది. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవనున్నాయి. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచులు జరిగాయి. బలమైన జట్లు సైతం ఇక్కడ తమదైన సత్తాను చాటలేకపోవడం గమనార్హం. ఇక్కడి పిచ్‌ స్పిన్నలర్లకు సహకరించే అవకాశం ఉన్నది. లీగ్‌ దశలోనూ స్పిన్నర్లు రాణించారు. ఈ మైదానంలో న్యూజిలాండ్‌ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్‌ సంచలన విజయం నమోదు చేసింది. ఈ పిచ్‌పై స్పిన్నర్లు 5 వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. ఇందులో వెస్టిండిస్‌ బౌలర్‌ అకేల్‌ హోసేన్‌ 5, రషీద్ ఖాన్ 6 వికెట్లు తీశారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే పిచ్‌ స్పిన్నర్లకు ఎంత అనుకూలంగా ఎందో తెలుస్తుంది. అయితే, వర్షం పడితే పేసర్లకు సైతం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రొవిడెన్స్ స్టేడియం ట్రాక్‌ రికార్డు ఇదే..

ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇప్పటివరకు 18 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఆరు సార్లు, లక్ష్య ఛేదన చేసిన జట్లు తొమ్మిదిసార్లు విజయం నమోదు చేశాయి. ఈ గ్రౌండ్‌లో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే సాధించిన 100 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. 2010లో జింబాబ్వేపై ఈ రికార్డును నెలకొల్పాడు. అత్యధిక జట్టు స్కోరు 191/5గా ఉన్నది. 2010లో ఈ స్కోరును వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ నమోదు చేసింది. అత్యల్ప స్కోరు 39గా (ఉగాండా) ఉన్నది. 2024 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్ చేతిలో ఉగాండా ప్లేయర్లు 39 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్య ఛేదన 169/5గా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోర్‌ ఇక్కడ 133 పరుగులుగా ఉంది.