విధాత, హైదరాబాద్ : మియాపూర్ బాలిక(12) అనుమానాస్పద మృతి కేసును వారం రోజుల వ్యవధిలో పోలీసులు చేధించారు. కామంధుడైన కన్న తండ్రినే కన్న కూతురుపై లైంగిక దాడి చేసే ప్రయత్నంలో హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ పోలీసుల కథనం మేరకు స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండాకు చెందిన బానోతు నరేశ్ దంపతులు బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చారు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును తండ్రి నరేశ్ హత్య చేశాడని తెలిపారు. బానోతు నరేశ్ కొంత కాలంగా తాగుడుకు బానిసై సెల్ఫోన్లలో నీలి చిత్రాలు చూడటం వ్యసనంగా మార్చుకున్నాడని, సెల్ఫోన్ పాడవ్వడంతో నీలి చిత్రాలు చూడలేక మానసికంగా విసుగెత్తిపోయిన నరేశ్ తన కోరికను కూతురుతో తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడని వివరించారు. బాలికను వారం రోజుల క్రితం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంతం చేశాడని, తండ్రి దుశ్చర్యలను వ్యతిరేకించిన బాలిక అమ్మకు చెబుతానంటూ బెదిరిస్తూ గట్టి అరిచిందని, దీంతో బాలిక ఎక్కడ తన తల్లికి విషయం చెబుతుందేమోనన్న భయంతో నరేశ్ కన్న కూతురిని అమానుషంగా జుట్టు పట్టి నేలకేసి కొట్టి హతమార్చాడని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం నుంచి ఇంటికి వచ్చి తిరిగి మళ్లీ బాలిక మృతదేహం వద్ధకు వెళ్లి చనిపోయిందా లేదా అని చూసి వచ్చాడని, అలా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూసివచ్చాడని పోలీసులు వెల్లడించారు. తన కూతురు తప్పిపోయిందంటూ భార్యతో కలిసి ఏమి తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడని, వారం రోజుల పాటు అసలు విషయం దాచాడని వివరించారు. తాము తండ్రి నరేశ్ వ్యవహారశైలిపై అనుమానంతో పాటు వివిధ కోణాల్లో నాలుగు బృందాలతో కలిసి విచారణ చేపట్టామన్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి కేసును చేధించి నిందితుడు నరేశ్ను రిమాండ్కు తరలించామని తెలిపారు.