పసికందుపై పిచ్చికుక్క దాడి , చికిత్స పొందుతూ మృతి .. మడిపల్లిలో తీవ్ర విషాదం
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల పసికందు (బాబు) పై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలపాలైన పసికందును ఆసుపత్రికి తరలించారు

విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల పసికందు (బాబు) పై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలపాలైన పసికందును ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి బాబు మృతి చెందారు. ఈ దయనీయమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మడిపల్లికి చెందిన రేణుకకు నెల్లికుదురు మండలం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకన్నతో వివాహమైంది. ప్రసవం కోసం రేణుక తల్లిగారిల్లు మడిపల్లికి వచ్చింది. 42 రోజుల క్రితం ప్రసవించిన రేణుక మగ శిశువుకు జన్మనిచ్చింది.
సోమవారం ఉదయం 8 గంటలకు రేణుక, ఆమె తల్లి వెంకటమ్మ బయట ఇంటిపనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో ఓ పిచ్చికుక్క ఇంట్లోకి చొరబడింది. మంచంలో నిద్రిస్తున్న శిశువు తలపై తీవ్రంగా గాయపర్చింది. ఆ పసికందు ఏడుపు శబ్దం విని వారిద్దరు ఇంట్లోకి వెళ్లి చూడగా పసికందు తీవ్రగాయాలతో కనిపించాడు. వెంటనే తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న బిడ్డను కుక్క వచ్చి బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.