Adluri Laxman Vs Harish Rao : హ‌రీష్ బేష‌రత్తుగా క్ష‌మాప‌ణ చెప్పాలంటున్న మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌… ఎందు కో తెలుసా..

కాంగ్రెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వ్యక్తిగత అంశాలు కమిషన్ల పంచాయితీలు చర్చించారని హరీశ్ రావు చేసిన ఆరోపణలు అబద్ధమైతే సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Adluri Laxman Vs Harish Rao : హ‌రీష్ బేష‌రత్తుగా క్ష‌మాప‌ణ చెప్పాలంటున్న మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌… ఎందు కో తెలుసా..

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌21(విధాత‌): బీఆరెస్ ముఖ్య‌నేత మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కాంగ్రెస్ పార్టీకి బేష‌ర‌త్తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ డిమాండ్ చేస్తున్నారు. నీవు చేసిన ఆరోప‌ణలు త‌ప్ప‌ని నేను మా త‌ల్లిదండ్రుల‌పై ప్ర‌మాణం చేస్తి వ‌స్తాను. ఈ మేర‌కు నేను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అనుమ‌తి కూడా తీసుకుంటాను… మ‌రి నీవు సెంటిమెంట్‌గా భావించే దేవుడిపై ప్ర‌మాణం చేయ‌గ‌ల‌వా? అని ప్ర‌శ్నించారు. ఎక్క‌డికో అవ‌స‌రం లేదు… నీ సెంటిమెంట్ దేవుడైన సిద్దిపేట‌లోని వెంక‌టేశ్వ‌ర ఆల‌యంలో ఇద్ద‌రం త‌డి బ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణం చేద్దామా? అని అడిగారు. నీవు చేసిన ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మ‌ని నేను ప్ర‌మాణం చేస్తా… నీవు నిజ‌మ‌ని ప్ర‌మాణం చేస్తావా? రా…అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు స‌వాల్ విసిరారు.

ఇంత‌కూ హ‌రీశ్‌రావు కాంగ్రెస్ చేసిన ఆరోప‌ణ‌లు ఏమిట‌నే సందేహం వ‌స్తోంది క‌దా…? ప్ర‌మాణాలు చేసే స్థాయికి వెళ్లిన ఆరోప‌ణ‌లకు ఇటీవల కాలంలో జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశ‌మే కార‌ణ‌మైంది. మంత్రి వ‌ర్గ స‌మావేశానికి ముందు వ‌ర‌కు మంత్రులు కొండాసురేఖ‌, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిల మ‌ధ్య విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి. జిల్లా ఇంచార్జీ మంత్రి అయిన పొంగులేటిస‌మ్మ‌క్క‌- సార‌క్క‌ల గ‌ద్దెల అభివృద్ధి ప‌నుల ప‌రిశీల‌న‌, స‌మీక్ష స‌మావేశానికి ములుగు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా, సొంత శాఖ మంత్రి అయిన కొండా సురేఖ గైర్హాజ‌రు అయ్యారు. ఆ తరువాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి త‌ల్లి ద‌శ‌దిన క‌ర్మ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రి పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కొండా డుమ్మా కొట్ట‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ రెండు సంఘ‌ట‌న‌ల‌తో పాటు కొండా కుటుంబానికి భ‌ద్ర‌త త‌గ్గించ‌డం, దేవాదాయ శాఖ‌కు చెందిన డెవ‌ల‌ప్‌మెంట్ వ‌ర్క్స్‌ను రోడ్లు భ‌వ‌నాల శాఖ కు అప్ప‌గించ‌డం, ఓ ఎస్డీ సుమంత్ ను విధుల నుంచి తొల‌గించ‌డం పెద్ద చ‌ర్చ నీయాంశ‌మైంది. దీంతో కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొల‌గిస్తారా? అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అయ్యారు. ఆ మ‌రుస‌టి రోజు జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో కొండా సురేఖ పాల్గొన‌లేదు… అయితే కొండా సురేఖ ఏఐసీసీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో సుధీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ త‌రువాత విభేదాలు తాత్కిలికంగానైతే స‌మ‌సి పోయిన‌ట్లు వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

అయితే మంత్రి వ‌ర్గ స‌మావేశం కు ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌ధ్యంలో క్యాబినెట్ స‌మావేశంలో వ్య‌క్తిగ‌త అంశాలు చ‌ర్చ చేసిన‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వర్గం దండు పాళ్యం ముఠా కంటే అధ్వాన్నంగా తయారైంది. గ్రూపులుగా విడిపోయి తన్నుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. కమిషన్లు, కాంట్రాక్టులు, వాటాలు, కబ్జాల కోసం పోటీ పడుతూ పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ అతుకుల బొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకే అనుమానాలున్నాయని చేసిన ఆరోపణలే ఈ వివాదానికి కారణమైంది. దీనిపై తీవ్రంగా స్పంధించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హ‌రీశ్‌రావు బేష‌ర‌త్తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క్యాబినెట్ లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గం మ‌న్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ అన్నారు.