ప్రైవేటు మోజు తగ్గించేలా బడిబాటకు సరికొత్త ప్రచారం
బాగోగుల బాధ్యతలు అమ్మ కమిటీలకే
వినూత్న ప్రచారం చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: సర్కారీ స్కూళ్లకు పూర్వవైభవాన్ని తీసుకురావడంతోపాటు.. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నది. ఇందుకోసం వినూత్నంగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను చైతన్యవంతులను చేస్తున్నది. కాన్వెంట్ స్కూళ్లలో చేర్పిస్తే.. రూ.50 వేల నుంచి లక్షన్నర రూపాయల వరకూ ఖర్చవుతుందని, అదే సొమ్ము ఆదా చేసుకుని, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే.. వారి ఉన్నత చదువులకు పొదుపు చేసుకోవచ్చని సరికొత్తగా ప్రచారం చేస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రైవేటుపై మోజు తగ్గించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రమంతటా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి అధ్వర్యంలో అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఒక జత షూస్ను ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి మొదలైన బడిబాట ఈనెల 19వ తేదీ వరకు చేపడుతారు. బడీడు పిల్లలను, బడిమానేసిన విద్యారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలతోపాటు, విద్యా శాఖాధికారులు, హెడ్మాస్టర్లు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
ఇదే బడిబాట సందర్భంగా ప్రైవేటు స్కూళ్లపై మోజు తగ్గించి.. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కృషి చేసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బాగోగులు, బాధ్యతలను అమ్మ కమిటీలకు అప్పగించటం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 26823 పాఠశాలల్లో 20680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. 17729 పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం ఈ సారి వేసవిలోనే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా చెల్లించింది.