విధాత బ్యూరో, కరీంనగర్: పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు శుక్రవారం కరీంనగర్ జిల్లాకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా గడచిన పదేళ్లలో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నా, అధికారంలో ఉన్న ఏనాడూ రైతులను ఆదుకోని కేసీఆర్.
ప్రస్తుతం రైతుల పరామర్శ పేరిట జిల్లాకు వస్తుండడాన్ని ఒక ప్రకటనలో తప్పుపట్టారు.”మీ హయాంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఏనాడైనా ఆదుకున్నారా? అని ఆయన మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.పోయినేడాది మార్చిలో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి వారం రోజుల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తానని ప్రకటన చేసి నేటికీ నయా పైసా విదల్చకుండా రైతులను మోసం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు.పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకువస్తే దానిని పాతరేసి రైతులకు ద్రోహం చేసింది కేసీఆర్ కాదా? అన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి కెసిఆర్ మాట తప్పారని తెలిపారు.పంట నష్టపోయి అప్పులు పుట్టక కొందరు, వడ్లు కొనే నాధుడు లేక మరికొందరు గుండెలు పగిలి చనిపోతుంటే కనీసం పరామర్శించని కేసీఆర్. ఏ ముఖం పెట్టుకుని పంట పొలాల సందర్శినకు వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు .
రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా… వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా అని తన ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వ్యవసాయం రంగం నిజంగానే అభివృద్ధి చెందితే,రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి పైగా రైతులు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడ్డారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని పదేపదే ప్రచారం చేసిన కేసీఆర్ పాలనలో బోరు బావుల సంఖ్య 18 లక్షల నుండి 28 లక్షలకు ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు సాగు నీరందించకపోగా… కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారింది వాస్తవం కాదా అన్నారు. లక్షా 30 వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కమీషన్లకే తప్ప రైతుల కన్నీళ్లు తుడచలేకపోయిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నిజంగా రైతులపట్ల చిత్తుశుద్ధి ఉంటే, రాష్ట్రంలో రైతుల దుస్థితికి తానే కారణమని ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్ కు రావాలన్నారు .