విధాత : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సినీ నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ రోజు తన మిత్రుడు షాద్నగర్ అభ్యర్థి వీరపల్లి శంకర్ నామినేషన్ ర్యాలీకి హాజరయ్యానని, ఊరు దాటడానికి గంట పట్టిందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
అధికార బీఆరెస్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతూ నాయకులను, సోషల్ మీడియాను మేనేజ్ చేయవచ్చేమోగాని ప్రజలను మేనేజ్ చేయలేరని, వారు కాంగ్రెస్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. నవంబర్ 30 కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ అద్భుతం స్తృష్టిస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ త్యాగాలు చేసిందని, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ దేశసేవలో అంకితమయ్యారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అన్నిటికి తెగించి తెలంగాణ ఇచ్చింది అమ్మ సోనియమ్మ అన్నారు. రాహుల్గాంధీ తెలంగాలోనే మకాం వేస్తారన్నారు.
బీఆరెస్లో మంత్రులు ఎవరో కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు ఎవరనేది సంబంధం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. డిసెంబర్ 9 ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణాస్వీకారం చేస్తుందని, నేను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తని, ఇంత వరకు కాంగ్రెస్ కి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదన్నారు.