మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసిన భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వివాదం బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి షాక్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు కేసీఆర్, హరీశ్ రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది.

మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసిన భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు

మేడిగడ్డ కుంగుబాటు పిటిషన్‌పై నిర్ణయం
సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలన్న కోర్టు
హరీశ్‌రావు సహా 8మందికి నోటీసులు
రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్‌పై విచారణ

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వివాదం బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి షాక్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు కేసీఆర్, హరీశ్ రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు పేర్కొన్నది. ఆ రోజున విచారణకు రావాల్సిందిగా నోటీసులో కోర్టు పేర్కోంది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ నేపథ్యంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ చేపట్టనున్నారు. మేడిగడ్డ కుంగు బాటుపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు సూచనతో.

తొలుత తాను వేసిన పిటిషన్ ను ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తెలపలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో చేశానని రాజలింగమూర్తి తెలిపారు. బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్లు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఎఆర్ (నెం. 174/2023) న మోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పిటిషనర్ గుర్తుచేశారు.

కుంగుబాటుకు బాధ్యులు వారే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి డిజైన్ సహా నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో రాజలింగమూర్తి ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుతో పాటు పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీర్-ఇన్-చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దర్శించుకున్న ‘మేఘా’ నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిథులను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొనడంతో ఆ ఎనిమిది మందికి భూపాలలపల్లి ప్రిన్సివల్ సెషన్స్ జడ్జి నోటీసులు జారీ చేశారు. వారంతా కోర్టు నోటీసులనలు అనుసరించి సెప్టెంబరు 5న విచారణకు వీరు హాజర పుతారా? లేక వారి తరపున న్యాయవాదులను పంపిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.