విధాత: తెలంగాణలో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వారి ఆకాంక్షలను అనుగుణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార సాధన లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. తొలుత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీలో మాట్లాడారు. అనంతరం యాదాద్రి భువనగిరిలో జరిగిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలోనైనా బీజేపీ తప్పక పోటీ చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా ఉందని, ప్రజల ఆదరణ ఉందని, స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కోరారు. తెలంగాణ భవిష్యత్తు బీజేపీనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.
బీజేపీ పార్టీకి గ్రాడ్యుయేట్ లు, విద్యావంతులు, మేధావులు అండగా ఉన్నారని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యూయేట ఎమ్మెల్సీలో గెలుపు అవకాశాలున్నాయని, సమిష్టిగా పనిచేస్తే ఫలితం దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
బీఆరెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బీఆరెస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు అస్యహించుకున్నారని అందువల్లే బీఆరెస్ను ప్రజలు ఓడించారన్నారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడుతామని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు చేసేవరకు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని తెలిపారు.