27న బీఆరెస్ అవిర్భావ దినోత్సవం

బీఆరెస్‌ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు

  • Publish Date - April 26, 2024 / 06:36 PM IST

పార్టీ జెండాలు ఎగరేయాలని కేటీఆర్ పిలుపు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలలో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏప్రిల్ 27, 2001 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం.. పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లోనూ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను పార్టీ జెండాను శనివారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరించనున్నట్లుగా తెలిపారు.

Latest News