SLBC Tunnel Tragedy | నాలాలో మూడు..సొరంగంలో ఆరు : రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ నాలా, ఎస్ఎల్బీసీ సొరంగం మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.

SLBC Tunnel Tragedy | నాలాలో మూడు..సొరంగంలో ఆరు : రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్

విధాత, హైదారబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ ప్రభుత్వం కారణంగా జరిగిన తప్పిదంతో ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేదని..ఇప్పుడు హైదరాబాద్‌ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలు మూడు రోజులైనా గుర్తించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటదా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్న నాలాలు ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారని..నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని కేటీఆర్ హెచ్చరించారు.

రాజ్యాంగం..సుప్రీంకోర్టు అంటే బీజేపీకి గౌరవం లేదు

భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీకి గౌరవం లేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం అన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదం-జింగోయిజం అని..పాక్‌తో క్రికెట్‌ ఆడితే లేని నొప్పి.. వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తే ఎందుకో? అని ప్రశ్నించారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోడీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదమన్న కేటీఆర్ తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి అని కేటీఆర్ తెలిపారు.