తెలంగాణ ఉద్యమం అయి పోలేదని, ఇంకా ఉందని, తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉందని ఇందుకోసం మనమంతా ముందుకు సాగాల్సిన అవసరముందని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు
ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలొచ్చిన గెలుపు బీఆరెస్దే
వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్
విధాత: తెలంగాణ ఉద్యమం అయి పోలేదని, ఇంకా ఉందని, తెలంగాణ పునర్నిర్మాణం మిగిలే ఉందని ఇందుకోసం మనమంతా ముందుకు సాగాల్సిన అవసరముందని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆరెస్ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగైదు నెలల్లోనే ప్రజల్ల నమ్మకం కోల్పోయిందని కేసీఆర్ విమర్శించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డానని, ప్రధాని మోదీ కూడా అసూయపడే రీతిలో రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో కృషి చేశానని చెప్పుకొచ్చారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి చెన్నైకి వెళ్లి పోయిందని, అల్యూమినియం, ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విదిస్తున్నారని, దీంతో ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాయన్న వార్తలు చూస్తుంటే బాధ వేస్తుందన్నారు.
నాలుగైదు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు ఇలా చేశారని దుఃఖం కలుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్కు ఎదురైన ఓటమి తాత్కాలికమేనని, రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజమని, గెలిస్తేనే లెక్క అనుకోవద్దని, గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆరెస్ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతుల కోసం బీఆరెస్ రైతుబంధు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా రైతుబంధు బంద్ అయ్యిందని, కరెంటు ఉండటం లేదని, మంచినీళ్లు మాయమయ్యాయన్నారు. గోదావరిలో తెలంగాణ వాటను ప్రధాని మోదీ తీసుకెలుతానంటున్న సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.