KTR | దమ్ముంటే చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి దమ్ముంటే “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా సవాల్ చేశారు.

రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా
ఎన్నికల్లో గాలి మాటలు..గద్దె నెక్కాక గాలిమోటార్లలో విహారం
మీ ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది “గుండుసున్నా అంటూ విమర్శలు
KTR | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి దమ్ముంటే “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా సవాల్ చేశారు. రుణమాఫీ (Runa Mafi)కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..? అంటూ విమర్శించారు. ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా అని ప్రశ్నించారు. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా అని, ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారని, గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారని విమర్శలు గుప్పించారు. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని ప్రశ్నించారు. అన్నదాతలను ఆగంచేసి దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరని ప్రశ్నించారు.
అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని నిలదీశారు. రైతులకేమో మాయమాటలు, ఢిల్లీ (Delhi) పెద్దలకు మాత్రం మూటలా? అని కీలక ఆరోపణలు చేశారు. 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది “గుండుసున్నా” అని, ఓవైపు డెంగీ మరణాలు మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలతో గాడితప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుకుతుందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదని, తెలంగాణ గల్లీల్లో ఉండాలన్నారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి అన్నదాతలను అరిగోస పెట్టి హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే, తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యమన్నారు.