:ఎన్నికలలో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా మోడీ ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభం అయ్యాయి
విధాత, వరంగల్ ప్రతినిధి :ఎన్నికలలో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా మోడీ ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో రాజకీయ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభం అయ్యాయి. తొలుత సీపీఐ పతాకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ఆవిష్కరించారు. బుస్సా రవీందర్ అద్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభ సభలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టడం వల్ల లోక్ సభ ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మోడీ పదేళ్ల పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి భిన్నంగా పాలన జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేశారని అన్నారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి,అనేక మందిపై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపారని అన్నారు. రైతుల, కార్మికుల వ్యతిరేక చట్టాలు తెచ్చారని, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని, దాదాపు 12 లక్షల కోట్లు వారికి రాయితీ ఇచ్చారని అన్నారు. చివరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. దీంతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బీజేపీ కి పూర్తి మెజారిటీ రాలేదని, టిడిపి, జేడియూ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. లోక్ సభకు ఎన్నికైన వారిలో 259 మంది నేర చరిత్ర కలవారు ఎంపీలుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో గత బీఆరెఎస్ ప్రభుత్వం కూడా ఇష్టారీతిన వ్యవహరించడం వల్లనే ఇంటికి సాగనంపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు రేషన్ కార్డులను, ఫించన్లను అందించాలన్నారు. కమ్యూనిస్టులు ప్రజల మధ్య ఉండి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, నేదునూరి జ్యోతి, మేకల రవి, కర్రె బిక్షపతి, పంజాల రమేష్, ఎన్.అశోక్ స్టాలిన్, షేక్ బాష మియా,పనాస ప్రసాద్ పాల్గొన్నారు.
*