Revanth Reddy | శాంతిభద్రతలపై కఠిన వైఖరి
హైదరాబాద్ నగర శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.

రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్
ప్రపంచంతో పోటీపడేలా హైదరాబాద్ అభివృద్ధి
అందుకోసమే మెగా మాస్టర్ప్లాన్ 2050
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం
గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికేది
అబద్ధాల ప్రాతిపదికన దుష్ప్రచారం
మూసీ డీపీఆర్ మీకు ఎందుకు?
కాంట్రాక్టర్ల నుంచి దండుకునేందుకా?
80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం కూలింది
శాంతిభద్రతలపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగర శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. వర్షం వస్తే చుక్కనీరు రోడ్లపై నిల్వ ఉండకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించామని, వాటర్ హార్వెస్టింగ్ గుంతలు నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. అత్యధిక వర్షాలు పడినపుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్ డిజైన్ చేయాలని అధికారులకు సూచించామని, 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టామన్నారు. వర్షాలు పడినపుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో నగర అభివృద్ధిపై విపక్ష, స్వపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ప్రపంచంతో హైదరాబాద్ మహానగరం పోటీపడే విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తామని తెలిపారు. వరల్డ్ సిటీగా రూపొందించేందుకు హైదరాబాద్ మెగా మాస్టర్ ప్లాన్ -2050తో ముందుకు వెళ్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రపంచ దేశాలను స్టడీ చేసి రెండువేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రాను రూపొందించామన్నారు. నాలాలను కబ్జా చేయాలంటే వణుకు పుట్టాలన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ పనికిరాదు…
గతంలో గంటకు 2సెం.మీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ డిజైన్ చేశారని, వాతావరణ మార్పులతో కుంభవృష్టి కురిస్తే వరదలు వస్తున్నాయని, సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రాను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. నాలాలు ఆక్రమణ చేయాలంటేనే గుండెల్లో గుబులు పుట్టాలని, అలాంటి వ్యవస్థను తీసుకు వస్తామన్నారు. హైదరాబాద్ నగర ప్రజల ఇబ్బందులు తొలగించాలని ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం 1965లో మంజీరా జలాలు, 1982 సింగూరు జలాలు, 2004 లో కృష్ణా ఫెజ్-1, 2008 కృష్ణా ఫెజ్-2 ద్వారా తాగు నీరు అందించిందని రేవంత్ వివరించారు. 2014లో కృష్ణా ఫెజ్-3 90శాతం పనులు కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. కానీ 2015 లో తామే తెచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఎత్తిపొడిచారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ నగరం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని రేవంత్రెడ్డి ప్రశంసించారు.
గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికేది..
హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో ఆడబిడ్డను రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. దిశ అత్యాచార ఘటనలో ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించ లేదన్నారు. మొయినాబాద్ దగ్గర బీఆర్ఎస్ నాయకుడు రేప్, మర్డర్ చేస్తే చర్యలు శూన్యమన్నారు. వాళ్ల హయాంలో ఇంత జరిగితే అబద్ధాల ప్రాతిపదికన తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికే పరిస్థితి.. ఇవాళ గంజాయి అమ్మాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చామన్నారు.
హైడ్రాతో ఎంతో మేలు….
గొప్ప ఆలోచనతో సమాజానికి విస్తృత సేవలు అందించేందుకు హైడ్రాను తీసుకోచ్చామని, నగరానికి అధ్బుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. 55 కి.మీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నామని తెలిపారు. ‘రూ.లక్ష 50వేల కోట్లకు అంచనాలు పెంచారని కేటీఆర్ అంటుండు.. మీ హయాంలో కాళేశ్వరం కడితిరి.. కూలిపోయింది కదా’ అన్నారు. తాము పని మొదలు పెట్టకముందే డీపీఆర్ అడుగుతున్నారన్న రేవంత్రెడ్డి.. కాంట్రాక్టర్లతో మాట్లాడుకుని కమీషన్లు దండుకునేందుకా? అని ప్రశ్నించారు. నగరంలో చెరువులు, కుంటలను కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్రమత్తమయ్యామన్నారు. అద్దాల మేడలు, రంగులగోడలను చూపించి ఇదే అభివృద్ధి అని గత పదేళ్లలో ప్రచారం చేసుకున్న పెద్దలు ఈ సభలోనే ఉన్నారు. చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా విలసిల్లింది. రాబోయే వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నాం. ఆక్రమణలను నియంత్రించే బాధ్యత కూడా హైడ్రా తీసుకోనుందని రేవంత్ రెడ్డి వివరించారు.
80వేల పుస్తకాలు చదవలేదు…
మేము 80వేల పుస్తకాలు చదివినం అని చెప్పుకోవడంలేదు… 80వేల పుస్తకాల నాలెడ్జ్ తో మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయిందన్నారు. అప్పుడే ఏదో జరిగిపోయినట్టు ఎందుకు వాళ్లకు ఇంత బాధ. పదేళ్లు వాళ్లు పరిపాలించారు… పది నెలలు కాకముందే మాపై ఎందుకింత ఆక్రోశమని ప్రశ్నించారు. 200 సంవత్సరాలు ఏలిన నిజాం లే ప్రజాస్వామ్యానికి తలొగ్గారు… పదేళ్లు ఏలిన మీరెంత? ప్రజల ఆమోదం ఉంటే నాయకులు అవుతారు తప్ప.. ఎదుటి వారిని అవహేళన చేస్తే కాదన్నారు.
గజ్వేల్ నీళ్లు కాంగ్రెస్ భిక్షే…
మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ కు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నాను. కాంగ్రెస్ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వచ్చే నీటినే మధ్యలో పైప్ లైన్ ద్వారా గజ్వేల్ కు అందించారు. నీ గజ్వేల్ కు ఇచ్చే నీళ్లు కూడా కాంగ్రెస్ తెచ్చిన ప్రాజెక్టు నుంచి ఇచ్చినవే…
మిరాలంపై సస్పెన్షన్ బ్రిడ్జీ, ఐ టవర్….
హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరి సలహాలు తీసుకోవాలన్నదే మా ఆలోచన. మిరాలం చెరువుపై 2.6 కి.మీ సస్పెన్షన్ బ్రిడ్జి, లండన్ ఐ లాంటి టవర్ ను కూడా నిర్మాణం చేస్తామన్నారు. నిజమైన హైదరాబాద్ నిజమైన అభివృద్ధికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని, గత ప్రభుత్వం వారి విలాసవంతమైన జీవితం కోసం ప్రగతి భవన్, ఆఫీసు కోసం సచివాలయం నిర్మించింది తప్ప ప్రజల కోసం వాళ్లు చేసిందేం లేదని దెప్పిపొడిచారు. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ గుడికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, మాజీ సిఎం కెసిఆర్ తన సెంటిమెంట్ కోసం ప్రజల సెంటిమెంట్ ను ఫణంగా పెడితే ఏమైంది.. దిక్కులేని పరిస్థితి వచ్చిందన్నారు.
కిషన్ రెడ్డి కేసీఆర్ మాట వింటున్నాడు..
రాష్ట్ర అభివృద్ధికి కలసి పనిచేద్దామని చెప్పినా కిషన్ రెడ్డి ముందుకు రాలేదని, ఆయన పాత మిత్రుడు కేసీఆర్కు కోపం వస్తుందని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ముందుకు రావడంలేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి రండి.. మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులను తెచ్చుకుందామని, రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం సభాముఖంగా రేవంత్ రెడ్డి కోరారు.