కాంగ్రెస్ సారధ్యంలోని మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, మేం పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
విధాత: కాంగ్రెస్ సారధ్యంలోని మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, మేం పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన తొలి ప్రసంగం చేస్తూ అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నానని…ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు.
పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామన్నారు.
ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టామని, రేపు శనివారం ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తామన్నారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తామని, పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటానని..గుండెల్లో పెట్టుకుంటానన్నారు.