CM Revanth Reddy | ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లే.. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy | హైదరాబాద్ : ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లే.. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కలెక్టర్ల సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ఒక శంకరన్, ఒక శ్రీధరన్లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి అని రేవంత్ రెడ్డి సూచించారు.
ఏసీ గదులకే పరిమితం కాకూడదు.. క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే..
క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని కలెక్టర్లకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు రేవంత్.
కలెక్టర్లు బదిలీ అయినా.. ప్రజల నుంచి ఆ స్పందన రావాలి..
ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు ఆ ఉపాధ్యాయులను సొంత కుటుంబ సభ్యుల నుంచి దూరమవుతున్నట్లు భావోద్వేగాలకు లోనయ్యారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది.
ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి అని రేవంత్ రెడ్డి సూచించారు.