రైతు – మహిళ – యువత నామ సంవత్సరం
ఈ నూతన సంవత్సరం ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్రెడ్డి తెలిపారు

- నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం
- కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలు
- విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం
- సాగునీటి రంగంలో అవినీతిపై శ్వేతపత్రం
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడి
- రాష్ట్ర ప్రజలకు సీఎం న్యూఇయర్ గ్రీటింగ్స్
విధాత : ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుల చేశారు. ‘మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
‘యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి… వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
గత పాలనలో స్తంభించి పోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించామని రేవంత్ తెలిపారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందన్నారు. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ‘గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం’ అని వివరించారు.
ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారని, అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయని సీఎం ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దని ప్రజలను కోరారు. ‘ఇది గత పాలన కాదు.. జన పాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి’ అని పేర్కొన్నారు. ‘అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’ అని తెలిపారు. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ‘కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా… కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా… అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ… ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ… అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.