CM Revanth Reddy | తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి: సీఎం రేవంత్ ఆదేశం

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు

CM Revanth Reddy | తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి: సీఎం రేవంత్ ఆదేశం cm-revanthreddy

అకాల వర్షాలకు జరిగిన నష్టంపై ఆరా
ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా తగిన సహాయక చర్యలు
పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం

విధాతః కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖ‌ల అధికారులు, సిబ్బంది తగిన స‌హాయ‌క చ‌ర్యలు చేపట్టాలని చెప్పారు. మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు.