పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెట్టుకుని మాటల తూటాలు పేల్చుతున్నాయి
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
ఇప్పటి కే ఐదు సార్లు జిల్లాలో పర్యటించిన సీఎం
వంశీ గెలుపు కోసం ఎమ్మెల్యే లు కష్ట పడాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలో 14 స్థానాలు గెలిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి అంటూ ప్రచారం
ఆగస్టు 15 లోగా రుణ మాఫి చేస్తానని పాలమూరు గడ్డ నుంచే రేవంత్ రెడ్డి ప్రకటన
మళ్ళీ పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో రోడ్డు షో లో పాల్గొనబోతున్న సీఎం
న్యాయయాత్ర పేరుతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇదివరకే ప్రచారం
బీజేపీ, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని కాంగ్రెస్ నేతల భయం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెట్టుకుని మాటల తూటాలు పేల్చుతున్నాయి.మేమేమి తక్కువ కాదన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ నేతల మాటలను ఉతికి ఆరేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ ను ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారు. పాలమూరు స్థానంతో పాటు నాగర్ కర్నూల్ స్థానంలో లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ పాలమూరు పార్లమెంట్ స్థానంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఉండడంతో ఈ స్థానంలో గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఐదు సార్లు వచ్చి వెళ్లారు. నారాయణ పేట, కొడంగల్ మహబూబ్ నగర్ కు రెండు సార్లు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్, మక్తల్, నారాయణ పేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
వీటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహించడం తో కాంగ్రెస్ గెలుపు సునాయసంగా ఉంటుందని అధిష్టానం అనుకుంది. కాని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీ ఆర్ ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానాని కి నివేదికలు వెళ్లాయి. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కళ్ళు తెరిచారు. సునాయాసంగా గెలుస్తామనే ధీమాలో ఉన్న కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి వేణుగోపాల్ ఈ మధ్య నోవాటెల్ హోటల్ లో క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
సీఎం జిల్లా లో కాంగ్రెస్ ఓటమి చెందితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని వేణుగోపాల్ చెప్పినట్లు తెలిసింది. ఆయన సూచన తో కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడి విసృతంగా ప్రచారం ముమ్మరం చేశారు. సొంత జిల్లా లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందితే అందరి వేళ్ళు తన వైపే చూపుతారనే ఉద్దెశం తో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికీ ఈ సెగ్మెంట్ లో ఐదు సార్లు సీఎం ప్రచారం చేసారంటే ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే ప్రధానంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపారు. కార్యకర్తలే పార్టీ కి ముఖ్యమని, వారిని నేతలు విస్మరించవద్దని.. ఇది ఎమ్మెల్యే లు దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయాలని పలు మార్లు సీఎం కోరారు.
పాలమూరు గడ్డ నుంచే వరాల ప్రకటన
సొంత గడ్డ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులును విజయ తీరాలకు చేర్చి జిల్లా లో తన ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే వరాలు ప్రకటిస్తున్నారు. పాలమూరు పోరాటల గడ్డ అని ఇక్కడి నుంచి హామీలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతాయని, సొంత గడ్డ పై ఇచ్చిన హామీలు నెరవేర్చలనే కసి ఉంటుందనే ఉద్దెశం తో వరాల జల్లు కురిపిస్తున్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇస్తానని ప్రతి సమావేశం లో ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి హైలెట్ చేస్తూ వస్తున్నారు. మంత్రి వర్గంలో ముదిరాజ్ లకు స్థానం లేకపోవడంతో ఆ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్ళించేందుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటిస్తున్నారు. అలాగే రైతు రుణ మాఫి ఆగస్టు 15 లోగా చేస్తానని ఇక్కడి నుంచే ప్రకటించారు. ఈ రెండు ప్రధాన అంశాల ను పాలమూరు నుంచే ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ కి బలం చేకూరిందని నేతలు అంటున్నారు.
ఇక్కడ వంశీ చందు రెడ్డి, నాగర్ కర్నూల్ లో మల్లు రవి తో పాటు రాష్ట్రం లో 14 స్థానాల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.14 స్థానాలు రాహుల్ గాంధీ కి బహుమతి గా ఇచ్చి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని సీఎం ఆరాట పడుతున్నారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కి మద్దతుగా కాంగ్రెస్ నేతలు ఒక్కతాటి నిలబడడం చూస్తే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారా లేదా అనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది.