TELANGANA ASSEMBLY | రైతుల పాలిట భూతం ధరణి..రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం

ధరణి పోర్టల్ లోపభూయిష్టమైందని, అది రైతులు, పేదల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ధరణితో గ్రామాల్లో, పట్టణాల్లో భూ సమస్యలు పెరిగిపోవడానికి, రైతుల ఆత్మహత్యలకు కారణమైందని, భూ హక్కులలో తీవ్ర గందరగోళం తెచ్చిందని దుయ్యబట్టారు.

TELANGANA ASSEMBLY | రైతుల పాలిట భూతం ధరణి..రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం

భూహక్కులలో గందరగోళం
పెరిగిన భూ వివాదాలు
మాయమైన పేదల భూములు
రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం
భూములను కొల్లగొట్టే సాధనం

విధాత, హైదరాబాద్ : ధరణి పోర్టల్ లోపభూయిష్టమైందని, అది రైతులు, పేదల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ధరణితో గ్రామాల్లో, పట్టణాల్లో భూ సమస్యలు పెరిగిపోవడానికి, రైతుల ఆత్మహత్యలకు కారణమైందని, భూ హక్కులలో తీవ్ర గందరగోళం తెచ్చిందని దుయ్యబట్టారు. అసెంబ్లీలో శుక్రవారం భూ సంస్కరణల మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వం నాకే తెలుసునని, ఎవరు చెప్పినా వినని ఓ పెద్దాయన అపర మేధావి మాజీ సీఎం కేసీఆర్‌, ఆయనకు తొత్తుగా ఉండే అధికారి మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌లు గదిలో కూర్చుని తెచ్చిన ధరణి పోర్టల్ రైతుల, పేదళ్ల ఆస్తులను కొల్లగొట్టే సాధనంగా మారిందని ఆరోపించారు. అధికారి గదిలో కూర్చొని తీసుకొచ్చిందే ధరణి పోర్టల్.. కోట్లాది మంది ఆస్తులను గార్డియన్ గా ఉండాల్సిన పెద్దలే రైతుల, ప్రజల ఆస్తులు, భూముల హక్కులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పేదోళ్ల ఆస్తులను కొల్లగొట్టారని, మాయదారి పోర్టల్ ధరణి భూతంతో భూములు మాయం చేశారన్నారు , ప్రతి ఊరిలో సామాన్యుడు భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ధరణి భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం గుండుసున్న అయ్యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ సంస్కరణలను, భూముల పంపకాన్ని వివరించిన పొంగులేటి ధరణితో వాటిలో చాలవరకు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు.

చట్టంలో లోపాలతో అందరికి అవస్థలే

ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తామని అప్లికేషన్లు స్వీకరించారని, కానీ కొత్త చట్టంలో అవకాశం లేకుండా చేసిన ఘనత బీఆరెస్‌ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సమీక్షలో పది గంటలు కూర్చొంటే కేసీఆర్‌నే మాట్లాడేవారని, మేం మాట్లాడడానికి అవకాశమే లేకుండా ఉండేదని, గుండె మీద చేయ్యేసి చెప్పండి. మీరేమైనా మాట్లాడారా? అని బీఆరెస్ సభ్యులను అడిగారు. గ్రామ స్థాయిలో ఉద్యోగి లేకుండా వీఆర్వో వ్యవస్థ లేకుండా చేశారని విమర్శించారు. అసలు గ్రామ స్థాయిలో ఓ ఉద్యోగి ఉండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ధరణి బాధితుల నుంచి ప్రతి గ్రామంలోనూ వేలాది అప్లికేషన్లు వస్తున్నాయని తెలిపారు.

డీఫాల్ట్ కంపెనీతో ఒప్పందం

డీఫాల్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆర్వోఆర్ 2020 ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనే కంపెనీకి అప్పగించారని, దేశానికి దశ, దిశ అంటూ ప్రగల్భాలు పలికిన దృతరాష్ట్రుడు కేసీఆర్‌ కౌగిలిలో ఈ పదేండ్లు రాష్ట్రం బందీయైందని, తెలంగాణ రైతులు కష్టాలు అనుభవిస్తున్నారని, ఈ చట్టం ద్వారా ఎంతో నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సమాజ ప్రగతిని నిర్దేశించే వారు ధరణి సంస్కరణలపై సలహాలు స్వీకరించకపోవడంతో సమస్యలు మరింత జఠిలమయ్యాయన్నారు. పేదల ఆస్తులు దొరల పేరు మీదికి మారాయన్నారు. ధరణి పోర్టల్ కంపనీ తర్వాత టెర్రాసిస్ కంపెనీగా మారిందని, ఐతే ఇది దివాళా తీసిన విదేశీ కంపెనీకి 2.50 కోట్ల వివరాలను అప్పగించారన్నారు. డీఫాల్ట్ కంపెనీ అని తెలిసినా వారి తొత్తులకు భూములను అప్పగించడానికే ఇలా చేశారని ఆరోపించారు. రావణాసురుడికి పది తలలైతే ధరణిని మూడు తలలతో మొదలు పెట్టి 33 తలలకు పెంచారన్నారు. ఎవరికీ అర్థం గాని భూతంగా ధరణి మారిందన్నారు. సామాన్యుల ఆస్తులను కనబడకుండా చేశారని, ఒక సర్వే నంబరులో కొంత భాగంపై వివాదం ఉంటే ఆ మొత్తం విస్తీర్ణాన్ని నిషేదిత జాబితాలో పెట్టడం ద్వారా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారన్నారని తెలిపారు.. మాయదారి పోర్టల్ ద్వారా మాయమైన ఆస్తులను తిరిగి పేదలకే ఇస్తామని ప్రకటించారు.

అందరి ఆమోదంతో కొత్త చట్టం

సామాన్యులకు సమస్యలగా మారిన ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు చేపట్టిన పాదయాత్రలో సింహభాగం భూ సమస్యలే వచ్చాయని పొంగులేటి వివరించారు. అందుకే మేం ధరణి సమస్యలపై అధ్యయనానికి కమిటీ వేశామని, ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం 10 గ్రామాల్లో స్టడీ పూర్తయ్యిందని వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోనూ స్టడీ చేస్తున్నామని, మరో 15 రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్నారు. అటు ఇప్పటికే ధరణి పోర్టల్ ని సవరించేందుకు, సమగ్ర భూ పరిపాలనకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు. కొత్త భూ చట్టం డ్రాఫ్ట్ నేటి నుంచే ప్రజల ముందు ఉంచుతున్నామని, మూడు వారాల పాటు అన్ని వర్గాల సలహాలను స్వీకరిస్తామని ప్రకటించారు. 80 వేల పుస్తకాలు చదివిన పెద్దాయన, గడి నుంచి బయటికి రాని వారు సలహాలు ఇచ్చినా ప్రజామోదం ఉంటే స్వీకరిస్తామన్నారని చురకలేశారు. వచ్చే శాసనసభలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమల్లోకి తీసుకొస్తామన్నారు.