Drones ban | హైదరాబాద్ నగరంలో డ్రోన్ల( Drones ) ఎగురవేతపై పోలీసులు నిషేధం విధించారు. సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ల పరిధిలో డ్రోన్లను, పారాగ్లైడర్స్ వంటి వాటిని ఎగురవేయొద్దని వాటిపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకంటే ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రోన్లు ఎగురవేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ, బేగంపేట్, మారేడుపల్లి, బోయిన్పల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో డ్రోన్లపై నిషేధం విధించారు. హైటెక్ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన సింధూ హాస్పిటల్ను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో బీజేపీ తలపెట్టిన జనాగ్రహ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే ప్రథమం.
మోదీ పర్యటన ఇలా..
- 10న మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్కు పయనం.
- మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
- 2.30 గంటలకు పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
- మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.15 గంటలకు సింధూ ఆస్పత్రి ప్రారంభం.
- సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు.
- గంట పాటు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో ప్రత్యేక సమావేశం.
- సాయంత్రం 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు.
- సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ప్రసంగం.
- సాయంత్రం 6.45 గంటలకు బేగంపేట నుంచి గుజరాత్కు బయల్దేరుతారు.
