హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఒకటి, రెండురోజుల్లో బీజేపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆహ్వానించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
విధాత బ్యూరో, కరీంనగర్: హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఒకటి, రెండురోజుల్లో బీజేపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు స్వయంగా పెద్దిరెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖత తెలిపారు. 1992లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఇనుగాల రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరి సాయిరెడ్డిపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పని చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2007లో టి.దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో చేరారు.
ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదానికి ఆకర్షితులై 2009లో ఆ పార్టీలో చేరారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనతో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటి చేసి ఓటమి పాలయ్యాడు. ఆ పార్టీ తీరుపై అసంతృప్తితో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడిగానూ సేవలదించారు. 2019 జూన్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత హుజారాబాద్ ఉప ఎన్నికకు ముందు 2021లో బీజేపీకి రాజీనామా చేసి బీఆరెస్లో చేరారు. తాజాగా ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన పెద్దిరెడ్డి మరోసారి బీజేపీలో చేరేందుకు నిర్ణయించకున్నారు.