కేంద్రంలో మూడోసారి రానున్న ప్రధాని మోదీ ప్రభుత్వ సహకారంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాదని, నన్ను గెలిపించే బాధ్యత మాత్రం మీదేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు
విధాత, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి రానున్న ప్రధాని మోదీ ప్రభుత్వ సహకారంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాదని, నన్ను గెలిపించే బాధ్యత మాత్రం మీదేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం, కాప్రా, జవహర్ నగర్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. శివాలయంలో జరుగుతున్న హోమానికి హాజరయ్యారు. స్థానికులు, మహిళలు ఈటలకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి రాబోతుందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశం మరింత ముందుకు వెలుతుందన్నారు. దేశ ప్రగతిలో మల్కాజిగిరి ప్రజలు భాగస్వాములుకావడం ద్వారా తమ నియోజకవర్గం అభివృద్ధికి కూడా బాటలు వేసుకునేలా ఇక్కడ బీజేపీ ఎంపీగా నన్ను గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ సాధించిన విజయాలను, తెలంగాణకు చేసిన 11లక్షల కోట్ల అభివృద్ధిని విస్మరించి కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీఆరెస్లు బీజేపీ తెలంగాణకు ఏం చేయలేదంటూ విమర్శించడం సిగ్గుచేటన్నారు.
ప్రధాని మోదీ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి, ఎస్సీ వర్గీకరణకు, రిజర్వేషన్ల కొనసాగింపుకు, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని ఇప్పటికే పలుమార్లు స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్, బీఆరెస్ తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీఆరెస్ పదేళ్ల అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన చూశామని, కాంగ్రెస్ ఎన్నికల హామీల మోసాలను చూస్తున్నామని అందుకే ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.