విధాత,: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని సుప్రసిద్ద శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి(Sri Matsyagiri Lakshmi Narasimha Swami) బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల్లో భాగంగా ఆదివారం మూడవ రోజు స్వామివారికి హనుమత్ వాహన సేవ(Hanumat Vahana Seva)ను నిర్వహించారు. హనుమాన్ వాహనధారిగా లక్ష్మీనరసింహస్వామి కొండపైన మాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహించాడు. స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. బ్రహ్మత్సవాలలో ఉదయం ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభఆరాధన, చతుస్థానార్చన, నిత్యహోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ స్వయం భూస్వామి వారికి నవకలశ స్నపనం నిర్వహించారు.
తదుపరి హనుమత్ వాహన సేవ నిర్వహించారు. మాడవీధులలో కళాకారుల నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు చేసి బలిహరణం, నివేదన తీర్ధప్రసాద గోష్టి నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకార కూచిపూడి ఆర్ట్ అకాడమీ కళాకారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన, వలిగొండకు చెందిన కళాకారులచే నరసింహస్వామి చెంచులక్ష్మి పరిణయం ప్రదర్శించారు.
సోమవారం స్వామివారి కల్యాణం
బ్రహ్మత్సవ ఘట్టాలలో కీలకమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం సోమవారం రోజున ఉ.11.00 గంటలకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈవో సల్వాది మోహన్ బాబు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ధర్మకర్తలు అర్రూర్ వెంకటేష్, రేఖల ప్రభాకర్, బండి రవికుమార్, గుండు జగన్ మోహన్ రెడ్డి, ఈతాప రాములు, గ్రామ పెద్దలు, అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
