Site icon vidhaatha

SCR | నేటి నుంచి పట్టాలెక్కనున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌.. ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు పొడిగింపు..!

SCR | ప్రయాణికులకు సౌత్‌ సెంట్రల్ రైల్వే తీపికబురు చెప్పింది. విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805-12806), విజయవాడ – కాకినాడ పోర్ట్ (17257), చెంగల్పట్టు -కాకినాడ పోర్ట్ (17643) రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం నుంచి యథావిధిగా రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది.

నిడదవోలు – కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 11 వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. ఇందులో జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ తదితర కీలకమైన సర్వీసులు ఉన్నాయి. అయితే, ఆయా రైళ్ల రద్దుపై ప్రయాణికులు నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఆయా రైళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ సర్వీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఆయా రైళ్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నది.

ఇదిలా ఉండగా.. మరో మూడు నెలల పాటు వివిధ మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుపతి – అకోల, అకోల – తిరుపతి , పూర్ణ – తిరుపతి, తిరుపతి – పూర్ణ , హైదరాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్ – హైదరాబాద్ రైళ్లను పొడిగించినట్లు పేర్కొంది. అలాగే, సికింద్రాబాద్ – తిరుపతి, తిరుపతి – సికింద్రాబాద్ , కాకినాడ టౌన్ – లింగంపల్లి , లింగంపల్లి – కాకినాడ సర్వీసులను అక్టోబర్ వరకూ పొడిగిస్తున్నట్లు వివరించింది.

Exit mobile version