బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయాక కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి విమర్శించారు.
లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు
విభజన హామీల పట్ల బీజేపీ నిర్లక్ష్యం
కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి
విధాత, వరంగల్ ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయాక కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి విమర్శించారు. లిక్కర్ కేసులో కెసిఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత ఇరుక్కుని తెలంగాణ పరువు తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యతో కలిసి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లల్లో, పదవుల్లో, ప్రభుత్వ పథకాల్లో, ఇతర పనుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.
గత ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయలేదని, పనులు, పదవులు, దళిత బంధు అమ్ముకున్నాడని రాజయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను నిజాయితీగా ఉండి పేదవాళ్లకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వర్ధన్నపేటలో చెల్లని రూపాయి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా చెల్లుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించి బీఆర్ఎస్ ను బొంద పెట్టారని చెప్పారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుభవం కావాలని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు వారు మొన్న సభలో తెలిపారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు. భూ కబ్జా రాయుడు అరూరి రమేష్ వస్తే మన బతుకులు ఆగమేనన్నారు.ఎంపీగా డాక్టర్ కడియం కావ్యను గెలిపిస్త నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కేంద్ర బీజేపీ నెరవర్ఛలేదని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని బిజెపి ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.