అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పుడు భార్య మంగళ సూత్రాన్ని అమ్మి నామినేషన్ రుసుం చెల్లించాలని చెప్పుకున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు వందల కోట్లు ఎక్కడి నుంచి
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
విధాత బ్యూరో, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పుడు భార్య మంగళ సూత్రాన్ని అమ్మి నామినేషన్ రుసుం చెల్లించాలని చెప్పుకున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపెల్లి గ్రామంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు.
2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసేందుకు భార్య మెడలోని మంగళసూత్రం విక్రయించి నామినేషన్ రుసుం చెల్లించినట్టుగా బండి అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు అసెంబ్లీకి, రెండు పర్యాయాలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ కు అంత డబ్బు ఎక్కడిదన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత వందల కోట్లు సంపాదించారనే ప్రచారం సర్వత్రా జరుగుతోందన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని బండి సంజయ్ అవినీతితోనే ఆ డబ్బు సంపాదించారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అదాని,అంబానీ కంపనీలకు దోచి పెట్టిందని ఆయన విమర్శించారు. నీతులు వల్లించే వారి నిజస్వరూపాలు తెలుసుకున్న ప్రజలు ఈసారి ఎన్నికల్లో బండికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం గ్రామాలకు వెళ్లిన ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు, స్పందన చూస్తే 50 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలుపొందడం ఖాయమని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.