Bhu Bharati | సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం; గడువు తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్!
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాnr. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారు. 300 రూపాయల ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారు.

- భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం
- వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు భూమి పటం
- 30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం
- భూమికి భూదార్ సంఖ్య కేటాయింపునకు ప్రణాళిక
- చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు
- భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమాల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Bhu Bharati | భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టానికి రూపకల్పన చేసిందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూసమస్యలు భూ భారతితో పరిష్కారం కానున్నాయని తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రైతు వేదిక, గన్నేరువరంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమాల్లో సత్పతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025 అమల్లోకి వచ్చిందని తెలిపారు. ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారని తెలిపారు. ఏ సమస్యను ఏ అధికారి? ఎన్ని రోజులలో పరిష్కరించాలి? అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. సీసీఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆర్డీవో, కలెక్టర్కు అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు.
భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఆర్డీవో నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, అక్కడి నిర్ణయంపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్లో అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డును ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య రానుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు.
భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పరిశీలించి ఆర్డీవో, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్, భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. భూ భారతి పోర్టల్ లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం 2500 రూపాయల ఫీజు చెల్లించాలని, దరఖాస్తు తో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని, ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని కలెక్టర్ వివరించారు. గడువు తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందని అన్నారు.
పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు , 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని అన్నారు. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. 300 రూపాయల ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్య లక్ష్మి, తహసీల్దార్లు, వివిధ వర్గాల ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.