KTR| కారు కావాలో, బుల్డోజర్ కావాలో..జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి: కేటీఆర్
జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ (Jubilee Hills)ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైన బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెర్క మహేష్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరాడు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తదని చెప్పుకొచ్చారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ లో ఖర్చుపెడతారు.. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10,000 ఇస్తారు అని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని, కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందేనని..అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందే అన్నారు.
అన్ని తెలిసే బీసీలను, అజారుద్ధీన్ ను బకరా చేశాడు: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి ఏం అమాయకుడు కాదు అని..ఆయనకు అన్ని తెలుసని.. 42శాతం రిజర్వేషన్ల పేరిట జీవో 9 జారీ చేసి బీసీలను మోసం చేశాడని..పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు. అలాగే కాంగ్రెస్ నేత అజారుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ సైతం చెల్లదని, కోర్టులో కొట్టుడుపోతదని సీఎంకి తెలుసు.. అయినా అజార్ని బకరా చేసిండు కేటీఆర్ ఆరోపించారు. ఆర్మీకి చెందిన భూమిని స్మశానవాటికకి ఇస్తున్నానని ముస్లింలని మోసం చేయడానికీ ట్రై చేశాడని ఆరోపించారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజం. ఆయన నిజాయితీగా చెబుతూ మరీ మోసం చేస్తున్నాడు. గతంలోనే ‘ మోసం చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు’ అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండని గుర్తు చేశారు. రెండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని..ఆయన రెండు సంవత్సరాలు కేవలం కేసీఆర్ నామం జపం చేసి కాలం గడిపేసిండు అని ఎద్దేవా చేశారు.
ఓడిస్తేనే హామీల అమలు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ను ఓడిస్తే ఎన్నికల హామీల అమలులో చేసిన మోసం గురించి వారి పార్టీపైన ప్రజలు కోపంగా ఉన్నారని అర్థం చేసుకుంటారని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ. 4 వేల పెన్షన్లు వస్తాయి.. ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలవుతాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా ‘మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తాదని కేటీఆర్ చెప్పారు. ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ రెండు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రూ.2 లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసింది అని విమర్శించారు.