Infant Death in Nagarkurnool | నాగర్​కర్నూల్​లో శిశువు మృతి: కుల దూషణ ఆరోపణలతో ఉద్రిక్తత

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఆలయంలో ఘర్షణ తర్వాత రెండు నెలల పసిపాప మరణించడంతో ఉద్రిక్తత నెలకొంది. కుల దూషణ ఆరోపణలతో బీసీ సంఘాలు ఆందోళన చేపట్టగా, ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు సందేహాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కానుంది.

Infant Death in Nagarkurnool | నాగర్​కర్నూల్​లో శిశువు మృతి: కుల దూషణ ఆరోపణలతో ఉద్రిక్తత

Infant Death in Nagarkurnool Sparks Unrest Amid Caste Abuse Allegations

విధాత తెలంగాణ డెస్క్​ | హైదరాబాద్​:

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల శిశువు మరణం కలకలం రేపింది. ఆలయంలో జరిగిన గొడవ, కుల దూషణ ఆరోపణల నేపథ్యంలో బీసీ సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. శనివారం ఉదయం శిశువు మరణించడంతో గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు సందేహాస్పద మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాట

పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం, బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన సి. చంద్రకళ కుటుంబం బుధవారం కుమ్మెర మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లగా, ఆలయంలో యు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కులం పేరుతో దూషిస్తూ వంద రూపాయల దర్శనం టికెట్ కొనాలని ఒత్తిడి చేశారని చంద్రకళ ఆరోపించారు. ఆయనతో పాటు ఎస్. మధు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులపై దాడి చేసి బెదిరింపులకు దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కొడుకు గణేష్ అడ్డుకోగా అతడిని తోసేసి, కొబ్బరి పీచు తీసే సాధనంతో దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆ సమయంలో తనను, కొడుకును కొట్టి బంగారు ఆభరణాలు లాగేసుకున్నారని, గ్రామంలో ఉండకూడదని, ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేస్తామని బెదిరించారని ఆరోపించారు. ముఖ్యంగా తన కోడలు, పసిపాపను వదిలేయమని వేడుకున్నప్పటికీ పాపను కాలితో తన్నారని చంద్రకళ పేర్కొన్నారు.

ఘటన అనంతరం పాపను నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా శనివారం ఉదయం మరణించింది. అయితే శిశువు గాయాలపై అధికారిక వైద్య వివరాలు ఇంకా వెలువడలేదు.

మరోవర్గం ప్రత్యారోపణలు – సర్పంచ్ సమర్థన

ఈ ఆరోపణలను కుమ్మెర సర్పంచ్ తుకారాం రెడ్డి ఖండించారు. దర్శనానికి ఎలాంటి టికెట్ వ్యవస్థ లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ రెడ్డి గణేష్‌ను ఒక్కసారి కొట్టగా, అనంతరం చంద్రకళ కుటుంబసభ్యులే రాళ్లతో దాడి చేసి అతడిని తీవ్రంగా  గాయపరిచారని చెప్పారు. శిశువుపై దాడి జరిగిందన్న విషయం సంఘటనా సమయంలో ఎవరూ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పోలీసుల దర్యాప్తు, బీసీ సంఘాల ఆందోళన

నాగర్‌కర్నూల్ ఎస్‌ఐ గోవర్ధన్ మాట్లాడుతూ, ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, సందేహాస్పద మరణం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. శిశువుకు బాహ్య లేదా అంతర్గత గాయాలు ఉన్నాయా అనేది పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా తేలుతుందని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై బీసీ సంఘాలు, ఇతర సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టి న్యాయం కోరాయి. కాగా, ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో వివాదం మరో మలుపు తిరిగింది.  ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.