ఎస్ఐ తీరుకు నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ఎస్ఐ తీరుకు నిరసనగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో శుక్రవారం జరిగింది

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఎస్ఐ తీరుకు నిరసనగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లో శుక్రవారం జరిగింది. వివరాలు..అయిజ మండల కేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయభాస్కర్ పలు భూవివాదాల్లో తలదూరుస్తున్నారని సురేష్ గౌడ్ అనే న్యాయవాది అడ్డుకున్నారు. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని ఎస్ఐని ప్రశ్నించారు. ఆయన ముందే ఎస్ఐ.. ప్రశ్నిస్తే ఊరుకుంటారా.. అస్సలు ఊరుకోలేదు.. నోటికొచ్చినట్లు లాయర్ ను దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడ్డారు.ఎస్ఐ విజయ భాస్కర్ తీరు పై న్యాయవాదులు మండిపడ్డారు.
వెంటనే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అందులో భాగంగా కోర్టు విధులు బహిష్కరిస్తూ జిల్లా న్యాయస్థాన సముదాయ ప్రధాన గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఎస్ఐ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముంద జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుష,, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కవితతో పాటు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయక్ కు వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురామిరెడ్డి మాట్లాడుతూ అయిజ పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్నారు. పోలిసులను సివిల్ తగాదాల్లో తలదూర్చవద్దని అత్యున్నత, ఉన్నత న్యాయస్థానాలతో పాటు ఉన్నతాధికారులు ఎన్ని మార్లు చెప్పిన కింది స్థాయిలో ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదన్నారు. పైగా ప్రశ్నించిన పౌరులను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ ఖాజమొహినుద్దీన్, ప్రధాన కార్యదర్శి షఫీవుల్లాతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.