• Telugu News
  • /Telangana

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎంపీ ఈటల

హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చర్చించారు. నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వెల్లడించారు.

Reported by: Subbu | తెలంగాణ‌ | Nov 16, 2025, 8:03 pm IST
Read Time: 4 mins
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎంపీ ఈటల

విధాత: హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణాల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చర్చించారు. నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వెల్లడించారు.

హైదరాబాదులో ప్రజలు ట్రాఫిక్ జాములతో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆఫీసులో పని చేసే సమయం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువ ఉందంటూ ప్రజలు వాపోతున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నా పనులు నత్తనడక నడవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఈటల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళ్లారు.

వరంగల్ హైవేలో నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని, వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారని ఈటల తెలిపారు. స్థానికంగా ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా పనులు వేగంగా జరగడం లేదని, ఇప్పటికే వారు ఇచ్చిన డెడ్ లైన్లు అన్నీ పూర్తి అయ్యాయి కాబట్టి మంత్రిని చొరవతీసుకోవాలని కోరామని ఆయన తెలిపారు.

బాలానగర్ – నరసాపూర్ హైవేలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఆ రూట్ లో కూడా ఒక ఫ్లైఓవర్ , నాగార్జునసాగర్ రింగ్ రోడ్డు నుంచి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరగుతుంది.. ఆ రూట్‌లో కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాగర్ రింగ్ రోడ్డు వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రిని కోరగా ఒప్పుకున్నారని అన్నారు. త్వరలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన వారిలో సభ్యులు ఈటలతో పాటు బీజేపీ అసెంబ్లీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు.

Also Read:Eetala Rajender | రేవంత్‌.. కేసీఆర్‌ చేసిన తప్పే చేస్తున్నావ్‌.. నీ చిట్టా మొత్తం మా దగ్గరుంది!