Ponguleti Srinivas Reddy : బీసీల కులగణనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్
బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించబోయే బీసీ డిక్లరేషన్ సభ గురించి సమీక్షించారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను బీసిల కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు.
కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సాధించామన్నారు. ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకమైందని ఈ సభను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించారన్నారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.