స్వతంత్ర భారత దేశంలో బీఆరెస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అతిపెద్ద స్కామ్ అని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు
విధాత, హైదరాబాద్ : స్వతంత్ర భారత దేశంలో బీఆరెస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అతిపెద్ద స్కామ్ అని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన ఉత్తమ్కుమార్రెడ్డి నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆరెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆరెస్ భ్రష్టు పట్టించిందని, తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహారించారన్నారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి నీటీ పారుదల సామర్ధ్యం 2014వరకు 57.79 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, అప్పటిదాకా 54,234కోట్లు ఖర్చు చేయగా, ఒక్కో ఎకరానికి 93వేలు ఖర్చు జరిగిందన్నారు.
2014-23వరకు పదేళ్లలో 1.81లక్షల కోట్లకు ఖర్చు పెరుగగా, 15.81లక్షలకు కొత్త ఆయకట్టు చేరిందని, ఒక్కో ఎకరానికి ఖర్చు 11.45లక్షలకు పెరిగిందన్నారు. గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి ఖర్చు 12 రెట్లు పెరిగిందన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి కావడానికి రూ.1.75 లక్షల కోట్లు కావాలన్నారు. కాళేశ్వరం సహా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టు సహా కేసీఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని రీడిజైన్లు చేసి, అంచనాలు పెంచి నాసిరకంగా సాంకేతిక లోపాలతో నిర్మించి భారీ దోపిడికి పాల్పడ్డారన్నారు. తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదన్నారు. గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాయలసీమ లిఫ్ట్ ఆపే అవకాశమున్నా మాజీ సీఎం కేసీఆర్ అపెక్స్ మీటింగ్కు ఉద్దేశపూర్వకంగా వెళ్లకుండా ఏపీ ప్రభుత్వానికి సహకరించారన్నారు.
గత పాలకులు ఇంజినీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజినీరింగ్ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేయగా, దురదృష్టవశాత్తూ మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. డిజైన్, నిర్మాణ లోపాలు, నాణ్యత, పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయిందని,. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీని.. కేవలం మూడేళ్లలోనే నే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారని ఉత్తమ్ మండిపడ్డారు. కుంగిపోయిన బ్యారేజీ పియర్ 20 కింద నుంచి పైవరకు ఏర్పడిన పగుళ్లను ప్రజంటేషన్ ద్వారా మంత్రి వివరించారు.
గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతి కారణంగా మేడిగడ్డి ఈ స్థితిలో ఉందని, ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.1800 కోట్లతో టెండర్లు పిలిచారని, ఆ తర్వాత అంచనా వ్యయం పెంచుతూ రూ.4,500 కోట్లకు తీసుకెళ్లిన తీరు అవినీతికి నిదర్శనమన్నారు. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగితే.. మేం అధికారంలోకి వచ్చే వరకు ఏ ఒక్కరోజు కూడా మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయంపై స్పందించలేదన్నారు. ప్రాజెక్టులపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి (ఎన్డీఎస్ఏ) ఉందని, ప్రణాళిక, డిజైన్, పర్యవేక్షణ లోపం కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయిందని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టంగా చెప్పిందని, అన్నారం బ్యారేజీకి ఈ తరహా ప్రమాదం పొంచి ఉందని నివేదికలో తెలిపిందని గుర్తు చేశారు.
కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా కోసం గత ప్రభుత్వం పట్టుపట్టలేదని.. బీఆరెస్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చాయన్నారు. కేసీఆర్ విధానాల వల్లే హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కృష్ణా బేసిన్లో న్యాయంగా తెలంగాణకు 68 శాతం వాటా రావాలన్నారు. 550 టీఎంసీల జలాలు తీసుకోవాలనే స్పృహ నాటి పాలకులకు లేదన్నారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింతకు గత ప్రభుత్వమే సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్ల కోసమే లబ్ధి కోసమే అంచనాల పెంపు
గత ప్రభుత్వం కాళేశ్వరంపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి వచ్చే ప్రయోజనం 52 పైసలేనని, అంచనాలు పెంచి గుత్తేదారులకు రూ.వేల కోట్లు లబ్ది చేకూర్చినట్లు కాగ్ నివేదికలో చెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం అవుతుందని, రాష్ట్రంలో అన్ని రంగాల ఒకరోజు విద్యుత్ వినియోగం కేవలం 196 మిలియన్ యూనిట్లు మాత్రమేనని, కాళేశ్వరం విద్యుత్ చార్జీలు ఏడాదికి రూ.10,374 కోట్లు అని, ఎలాంటి సర్వే నిర్వహించకుండా మల్లన్న సాగర్ నిర్మించారని, చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా ప్రమాదంలో పడుతుందన్నారు. ఆ ప్రాజెక్టు పరిధిలో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని కాగ్ తెలిపిందని ఉత్తమ్ వివరించారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెట్టి, దాని నిర్వాహణ భారంతో గుదిబండగా తయారుచేశారని ఆందోళన వ్యక్తం చేశారు.