మాజీ సీఎం వైఎస్ జగన్ హయంలో నిర్మించిన విశాఖ రుషికొండ భవనాలను స్థానిక నాయకులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రుషికొండ రాజ మహల్ రహస్యం ఇవాళ తెలిసిందని ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందన్నారు
450కోట్లతో రహస్య విలాస భవనాలు
విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం వైఎస్ జగన్ హయంలో నిర్మించిన విశాఖ రుషికొండ భవనాలను స్థానిక నాయకులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రుషికొండ రాజ మహల్ రహస్యం ఇవాళ తెలిసిందని ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వస్తే అడ్డుకున్నారని, కేసులు పెట్టారని మండిపడ్డారు. విశాఖ నుంచే జగన్ పరిపాలన చేస్తామని అప్పటి వైసీపీ ప్రభుత్వం అనేక ముహూర్తాలు పెట్టిందని, చివరికి ఘోరంగా ఓడిపోయిందన్నారు. అమరావతి రాజధానిగా అసెంబ్లీలో జగన్ మద్దతు ఇచ్చి తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి పచ్చటి రుషకొండకు జగన్ బోడిగుండు కొట్టారని విమర్శించారు.
ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారని, ముందు పర్యాటక భవనాలని, తర్వాత పరిపాలన భవనాలని చెప్పారని, రూ.450 కోట్ల ప్రజాధనం ఏం చేశారో వారికే తెలియాలని విమర్శించారు. ఈ భవనాల నిర్మాణ కాంట్రాక్టులను సైతం వైసీపీ నేతలకే ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో ఇంత వివాదాస్పద భవనాలు ఎక్కడా కట్టలేదని, అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని, లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజ భవనాలు నిర్మించారని, ప్రజావేదికకు అనుమతులు లేవని మాజీ సీఎం జగన్ సర్కార్ కూల్చివేసిందని, మరి రుషికొండకు ఏం అనుమతులు ఉన్నాయని కట్టారని ప్రశ్నించారు. న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం అందించారని, సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాలను మించి ప్రజా ధనంతో వీటిని కట్టారన్నారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని, వీటిని ఏం చేయాలోముఖ్యమంత్రి చంద్రబాబు చూశాక నిర్ణయం తీసుకుంటారన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పినా.. ప్రజలు నమ్మలేదని, అందుకే విశాఖలో కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ ఇచ్చి రాజధాని వద్దని తీర్పు ఇచ్చారన్నారు.