రేపు జరగాల్సిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చింది
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : రేపు జరగాల్సిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాశారు. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది.
పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99.86% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1439 మంది ఓటర్లకు 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారాయణపేట, నాగర్ కర్నూల్ పోలింగ్ కేంద్రాలలో ఇద్దరు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
మహబూబ్ నగర్ లో 245, వనపర్తి లో 218, గద్వాలలో 225 , కొల్లాపూర్ లో 67, అచ్చంపేటలో 79, కల్వకుర్తిలో 72 మంది, షాద్ నగర్ లో 171 మంది ఓటేశారు. నాగర్ కర్నూల్ లో 101 మందికి వంద మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్కరు ఓటు వేయలేదు. నారాయణపేటలో 205 మందికి 204 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఒక్క ఓటరు మాత్రం ఓటు వేయలేదు. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.