Municipal Elections | రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెల్లడి కానున్నాయి. సాయంత్రం సమయానికి తుది ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 123 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించి.. ఫలితాలను వెల్లడించనున్నారు.
123 కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ, డీజీపీ, కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాలు, నగరాలన్నీ కలిపి 73.01 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88, కార్పొరేషన్లలో 66.05 శాతం మంది ఓట్లు వేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91 శాతం, అతి తక్కువగా నందికొండలో 59.68 శాతం పోలింగ్ నమోదైంది. చౌటుప్పల్తో పాటు చండూరు, జిన్నారం, పోచంపల్లి మున్సిపాలిటీల్లో 90 శాతానికిపైగా ఓటర్లు ఓటు వేశారు.
