2nd National Highway | భద్రాద్రి కొత్తగూడెంకు వరం.. రెండో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
NH-930P జాతీయ రహదారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అభివృద్ధి మార్గంలో కొత్త మైలురాయిగా నిలవనుంది. రవాణా, వాణిజ్యం, ఉపాధి, పర్యాటకం, భద్రత అన్నింటికీ ఈ ప్రాజెక్టు బలంగా తోడ్పడనుంది. రాబోయే సంవత్సరాల్లో జిల్లా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే కీలక ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.
New NH-930P Highway to Boost Connectivity Between Hyderabad and Bhadrachalam
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
2nd National Highway | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా గుండా వెళ్లే రెండో జాతీయ రహదారిగా NH-930P నిర్మాణానికి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్–కొత్తగూడెం మధ్య ప్రయాణ సమయం, ఖర్చు రెండూ గణనీయంగా తగ్గనున్నాయి. రవాణా సౌలభ్యం పెరగడంతో పాటు, పరిశ్రమలు, గనులు, పర్యాటకం, ఉపాధి రంగాలకు ఇది గేమ్చేంజర్గా మారనుంది.
ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు, వలిగొండ మీదుగా హైదరాబాద్ శివారులోని గౌరెల్లి ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఈ జాతీయ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 3డీ గెజిట్ నోటిఫికేషన్(Section 3D of the National Highways Act, 1956)ను విడుదల చేసింది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రాజెక్టు పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లాకు కేంద్రం మరో కీలక వరం
ప్రస్తుతం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే ఖమ్మం, సూర్యాపేటల మీదుగా వెళ్లాలి. ఈ మార్గాల్లో ట్రాఫిక్, ప్రయాణ సమయం అధికంగా ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే NH-930P అందుబాటులోకి వస్తే నేరుగా గౌరెల్లి జంక్షన్ చేరుకునే అవకాశం లభించనుంది. దీంతో దాదాపు 40 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం కూడా గంటకు పైగా తగ్గే అవకాశముంది.
ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసల ఆధునిక హైవేగా అభివృద్ధి చేయనుండటం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, సర్వీస్ రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, రోడ్ సేఫ్టీ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ రహదారి, అభివృద్ధికి కొత్త దారి 
ఈ జాతీయ రహదారి హైదరాబాద్ శివారులోని గౌరెల్లి జంక్షన్ నుంచి ప్రారంభమై వలిగొండ, దుప్పల్లి, తిరుమలగిరి, పెద్దవంగర, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఎల్లందు మీదుగా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చేరనుంది. ఈ మార్గంలో ఇల్లెందు, బయ్యారం, కొత్తపేట, నెహ్రూనగర్ తదితర ప్రాంతాలు కూడా నేరుగా లేదా సర్వీస్ రోడ్ల ద్వారా అనుసంధానమవుతాయి.
ఈ ప్రాజెక్టు కోసం ఇల్లెందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో సుమారు 4.85 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. సుదిమళ్ల, బేతంపూడి, గొల్లపల్లి, కారుకొండ వంటి గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. మార్కెట్ విలువ ఆధారంగా రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక బృందాలను నియమించారు.
తారామతిపేటకు మహర్దశ
కాగా, గౌరెల్లి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఈ హైవే కలవనుండటంతో, అత్యంత సమీపంలో ఉన్న తారామతిపేట, గౌరెల్లి గ్రామాలకు అభివృద్ధి పరంగా మహర్దశ పట్టనుందని అంచనా వేస్తున్నారు. ప్రజా రవాణాతో పాటు వస్తు రవాణా కీలకంగా మారనుండటంతో ఈ ప్రాంతంలో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు వేగంగా విస్తరించే అవకాశముంది.
పెద్ద అంబర్పేట సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద లాజిస్టిక్ హబ్ను ఏర్పాటు చేయనుండటంతో, గౌరెల్లి – తారామతిపేట – పెద్ద అంబర్పేట జంక్షన్ మార్గం వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారనుంది. రాబోయే రోజుల్లో ఈ దారిలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగే అవకాశముండటంతో, అదనపు సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడనుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రహదారి జిల్లాలోని సింగరేణి గనులు, మైనింగ్ యంత్రాలు, బొగ్గు రవాణాకు ప్రధాన మార్గంగా మారనుంది. లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడంతో పరిశ్రమల పోటీతత్వం పెరగనుంది. భద్రాచలం వెళ్లే భక్తులు, అత్యవసర వైద్య సేవల కోసం హైదరాబాద్ వెళ్లే రోగులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
ప్రమాదాలను తగ్గించేలా క్రాష్ బారియర్లు, సీసీ కెమెరాలు, స్పీడ్ మానిటరింగ్ సిస్టమ్స్, రిఫ్లెక్టివ్ సైన్బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. రవాణా రంగ నిపుణుల ప్రకారం, ఈ మార్గం దక్షిణ తెలంగాణ లాజిస్టిక్స్ నెట్వర్క్ను పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది.
ఆర్థిక–సామాజిక ప్రభావం

NH-930P ప్రాజెక్టుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్థిక చైతన్యం మరింత వేగం పుంజుకోనుంది. పారిశ్రామిక పెట్టుబడులు పెరగడంతో పాటు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. నిర్మాణ దశలోనే వందలాది మందికి ఉపాధి లభించనుండగా, పూర్తయ్యాక వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశముంది.
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభించడంతో విద్య, వైద్యం, మార్కెట్ సదుపాయాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో నగరాలకు తరలించగలుగుతారు. ఇది వ్యవసాయ ఆదాయాన్ని పెంచే దిశగా దోహదపడనుంది.
గతంలో మావోయిస్టు ప్రభావితంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి మరింత బలోపేతం కానుంది. భద్రత, అభివృద్ధి రెండూ సమాంతరంగా పెరగడం వల్ల సామాజిక స్థిరత్వం మెరుగుపడనుంది. కేంద్ర రహదారుల శాఖ, NHAI ఆధ్వర్యంలో ప్రాజెక్టు అమలవుతుండటంతో విశ్వసనీయత మరింత పెరుగుతోంది.
రవాణా మౌలిక వసతుల నిపుణుల అభిప్రాయం ప్రకారం, NH-930P పూర్తయితే దక్షిణ తెలంగాణ ఆర్థిక పటంలో భద్రాద్రి జిల్లా కీలక కేంద్రంగా మారే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram