విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు బోనాలు సమర్పించి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా పాతబస్తీ మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఆలయాన్ని సందర్శించి..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆమె భక్తులతో కలిసి స్థానికులతో కలిసి ఉత్సాహంగా మాస్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. పట్టుచీర, నగలతో పాటు ఒంటిపై తలపాగా ధరించి ఆమె డ్యాన్స్ తో అదరగొట్టారు.
మరోవైపు ఆషాడ బోనాల వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ చిలకలగూడలోని కట్ట మైసమ్మ ఆలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
అంబర్పేటలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారికి మంత్రి సీతక్క పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.
https://www.instagram.com/reel/Dbz2Xxfv5Ob/?utm_source=ig_web_button_share_sheet