భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు సోమవారం శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట
విధాత : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు సోమవారం శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించనున్నారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణానికి సంబంధించి అధికారులు ఇప్పటికే రిహార్సల్ నిర్వహించారు.
సైబరాబాద్ సీపీ ఏకే మహంతి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి పై జంక్షన్, బొల్లారం జంక్షన్, నావి జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
20న పోచంపల్లిని సందర్శించనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ముర్ము ఈ నెల 20న భూదాన్పోచంపల్లిలో ఉదయం 11.10గంటల నుంచి మధ్యాహ్నం 12.10గంటల వరకు పర్యటిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన యాదాద్రి జిల్లా పోచంపల్లిలో జరిగే థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇక్కడ చేనేత వస్త్రాల తయారీలో వివిధ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులు, పద్మశ్రీ, సంత్కబీర్ తదితర జాతీయ అవార్డు గ్రహీతలు అవార్డులు పొందిన గజం గోవర్ధన్, గజం అంజయ్య, బాలయ్య, సంత్ కబీర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ సొసైటీతో పాటు ఇక్కడి షోరూంలను ఆమె సందర్శించనున్నారు.
మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలిస్తారు. స్థానిక చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తెలంగాణ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఔనత్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనను అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి, ఇక్కత్ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్ర్తాలు, పుట్టపాక తెలియా రుమాలును ప్రదర్శనకు ఉంచనున్నారు.